హీరోయిన్ త్రిష వ్యవహారం తమిళనాడు రాజకీయాలను కుదిపేశాయి. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి 12 గంటల హైడ్రామా తర్వాత స్టేషన్ నుంచి విడుదలయ్యారు.
అయితే త్రిషపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు ఖండించారు. తాజాగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా తీవ్రంగా ఖండించారు. త్రిషకు మద్దతుగా నిలిచిన కంగనా.. బహిరంగంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, డబుల్ మీనింగ్తో కూడిన అశ్లీల జోకులు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడం భవిష్యత్తుకు మంచి ఉదాహరణగా నిలుస్తుందని కూడా పేర్కొన్నారు.
డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. గాయని చిన్మయి శ్రీపాద, నటి ఖుష్బూ సుందర్ ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా కంగనా రనౌత్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ త్రిషకు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కంగనా రనౌత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య జోకులను నాగరిక సమాజం అంగీకరించదని స్పష్టం చేశారు. ‘‘బహిరంగంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, డబుల్ మీనింగ్తో కూడిన అశ్లీల, అసభ్య జోకులు చేయడం ఏ నాగరిక సమాజానికీ ఆమోదయోగ్యం కాదు’’ అని కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడంపై కూడా ఆమె స్పందించారు. ఈ చర్య భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మంచి ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ వ్యాఖ్యలకు సంబంధించి స్టాలిన్ను జైలుకు పంపారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటకు వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుంది’’ అని కంగనా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల చివరిలో ఆమె థంబ్స్-అప్ ఎమోజీని కూడా జత చేశారు.
చిన్మయి, ఖుష్బూ కూడా విమర్శలు
కంగనా కంటే ముందే గాయని చిన్మయి శ్రీపాద ఈ అంశంపై స్పందించారు. రాజకీయ నాయకులు మహిళలను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు అనుచిత నినాదాలు చేయడం మాత్రమే అసలు సమస్య కాదని, దానికి ప్రతిస్పందనగా మరింత అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడమే ప్రధాన సమస్య అని ఆమె పేర్కొన్నారు.
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ పోరులో మహిళలను ఆయుధాలుగా ఉపయోగించడం రాజకీయాల్లోని విషపూరిత సంస్కృతిని బయటపెడుతోందని విమర్శించారు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగా, ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగింది?
కావేరీ జలాల వివాదానికి సంబంధించి ఆగస్టు 3న తంజావూరులో డీఎంకే నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వేదిక కింద ఉన్న డీఎంకే కార్యకర్తలు నటి త్రిష పేరును నినదించగా.. ఉదయనిధి చిరునవ్వుతో డబుల్ మీనింగ్ ధోరణిలో వ్యాఖ్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను నటి త్రిషను ఉద్దేశించి మాట్లాడలేదని, కావేరీ నదిని ఉద్దేశించే వ్యాఖ్య చేశానని ఉదయనిధి వెంటనే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై టీవీకే కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆగస్టు 4న ఆయనను నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేశారు. 12 గంటల విచారణ తర్వాత ఉదయనిధి విడుదలయ్యారు.

