Kanchipuram Horror: తీసుకున్న అప్పు తీరే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ బాలింతను నిర్బంధించడం.. ఆ తర్వాత పురిటినొప్పులతో తల్లడిల్లిన ఆ తల్లి.. గుడారంలోనే ప్రాణాలు విడిచిన ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది.. కాంచీపురం జిల్లాలో అప్పు పేరుతో సాగిన అమానుషం ఓ బాలింత, పసికందు ప్రాణాలను బలిగొంది. సింగడివాక్కంకు చెందిన ఆనందన్, తేనెమొళి దంపతులు చెట్లు నరికే పనికి వెళ్లి.. యజమాని ఆరుముగం వద్ద రూ.20 వేల అప్పు తీసుకున్నారు. అప్పు తీరే వరకు తన గుడారం వద్దే ఉండాలంటూ యజమాని ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలో తేనెమొళికి పురిటి నొప్పులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదని ఆరోపణలు ఉన్నాయి. చివరకు గుడారంలోనే ప్రసవం ప్రారంభమై.. బిడ్డ సగం బయటకు వచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. వైద్యం అందక తేనెమొళి, పసికందు మృతి చెందారు. ఘటనపై పొన్నేరికరై పోలీసులు కేసు నమోదు చేసి యజమాని ఆరుముగంను అదుపులోకి తీసుకున్నారు. అప్పు పేరుతో దంపతులను బానిసలుగా పనిచేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

