పెద్ది సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ సన్నివేశాలపై దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ రచ్చ అవుతోంది. హీరోయిన్ను అశ్లీలంగా చూపించడంపై రగడ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు సినీ, రాజకీయ నాయకుల నుంచి కూడా బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, సీనియర్ నటి కరీనా కపూర్ కూడా పెద్ది దర్శకుడు బుచ్చిబాబుపై ధ్వజమెత్తారు.
సినిమాల్లో మహిళలను వస్తువులుగా చూపిస్తున్నారంటూ జయా బచ్చన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా తన కెరీర్లో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తనను తెరపై అశ్లీలంగా చూపించడానికి ప్రయత్నిస్తే వెంటనే దర్శకుడిని అడ్డుకున్నట్లు గుర్తుచేశారు. జాన్వీకపూర్ కూడా దర్శకుడిని అడ్డుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు. అయినా సెట్లో ఇలాంటి సంఘటనలు నివారించడం చాలా ముఖ్యం అన్నారు. తనకు ఇలా జరిగిప్పుడు.. తాను వెంటనే అభ్యంతరం తెలిపానని.. అటు తర్వాత ఏ చిత్ర నిర్మాత కూడా తనతో హద్దులు దాటడానికి సాహించలేదని వివరించారు.
‘పెద్ది’ వివాదం
‘పెద్ది’ సినిమా వివాదం, జాన్వీ కపూర్ పోషించిన పాత్రపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. సన్నివేశాల్లో కెమెరా పదేపదే జాన్వీ పొట్ట, ఎద భాగం, నడుము చూపించడంపైనే ఫోకస్ అయింది. అంతేకాకుండా అనుమతి లేకుండా జాన్వీని ముద్దు పెట్టుకునే సన్నివేశంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని కూడా తెలిపాడు. సన్నివేశాలు తొలగిస్తానని చెప్పాడు. అయినా కూడా విమర్శలు ఆగడం లేదు. గొడవ సద్దుమణగడం లేదు. పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది.

