కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్మంతర్ వేదికగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి శనివారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు శాంతించారు. దీంతో ఆందోళన విరమించినట్లుగా ప్రకటించారు. దీంతో జంతర్మంతర్ నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాగే పోలీసులు కూడా తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఢిల్లీ పరిసరాలు చాలా మట్టుకు ఖాళీ అవుతున్నాయి.
మరోవైపు విద్యార్థులంతా మెట్రో స్టేషన్లకు తరలివెళ్లడంతో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసిన రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారాలను తిరిగి తెరవడంతో నిరసనకారులు పెద్ద ఎత్తున మెట్రో స్టేషన్ వైపు తరలిపోయారు. దీంతో జంతర్మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రజల రద్దీ కనిపించింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అధికారులు ప్రజలను, నిరసనకారులను కన్నాట్ ప్లేస్ ప్రాంతాన్ని ఖాళీ చేసి రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వైపు వెళ్లాలని సూచించారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని, ట్రాఫిక్, ప్రజల రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని పోలీసులు తెలిపారు.

