చిన్నతనంలో పేదరికం.. బాల్యంలో అనాథగా.. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు ఎదిగి.. ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టడంతో భరించలేక ఆత్మాహత్యాయత్నం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదంతా ఎవరి కోసమంటారా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించే. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు. వివాదాలు చుట్టుముట్టడంతో అతనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి..
ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపాలం గ్రామం. బాల్యం అంతా కష్టాలతోనే మొదలైంది. నాలుగున్నర సంవత్సరాల వయసులో తల్లిని, 15 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. దీంతో అనాథ అయ్యాడు. కానీ వృద్ధ అమ్మమ్మ రమణమ్మ ఏ మాత్రం విడిచిపెట్టకుండా.. కూలీ పనులు చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డిని పెంచి బాగా చదివించింది. విద్యా ఖర్చుల కోసం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఒక క్లినిక్లో ల్యాబ్ టెక్నీషియన్గా పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకున్నాడు. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాక.. అనంతరం జవహర్ భారతి డిగ్రీ కళాశాల నుండి బీఏ పట్టా పొందాడు.
ఈ క్రమంలోనే 2012లో ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అయితే 2018లో జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఇక్కడే అతని జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఒక పాత పగ కారణంగా అతని సర్కిల్ ఇన్స్పెక్టర్ దాదాపు 60 మంది సహోద్యోగుల ముందు అదనంగా ఒక గంట డ్రిల్ శిక్ష విధించి బహిరంగంగా అవమానించాడు. ఈ అవమానం మానసికంగా కుంగదీయగలదు కానీ ఉదయ్ మాత్రం బీ.ఆర్ అంబేద్కర్ బోధనల నుంచి స్ఫూర్తి పొంది అవమానాన్ని బలంగా మార్చుకున్నాడు. అదే రోజున పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పరిగణించబడే యూపీఎస్పీ పరీక్షకు సిద్ధంగా కావాలని కంకణం కట్టుకున్నాడు.
కఠినమైన నిర్ణయమైతే తీసుకున్నాడు కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు వెళ్లే మార్గం ఉదయ్ కృష్ణారెడ్డికి అంత సులభం కాలేదు. 2019, 2021, 2022లో వరుసగా మూడుసార్లు విఫలమయ్యాడు. కట్-ఆఫ్ను స్వల్ప తేడాతో కోల్పోయాడు. అయినప్పటికీ ఎక్కడా కూడా బలహీనపడలేదు. మరింత బలం తెచ్చుకుని రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కష్టపడి చదువుతూ తన లక్ష్యం పట్ల నిబద్ధతతో స్థిరంగా ఉంటూ పట్టుదలతో ముందుకు సాగాడు. దీంతో యూపీఎస్సీ 2023లో 780వ ఆలిండియా ర్యాంకును, 2024లో ఐదవ ప్రయత్నంలో 350వ ర్యాంకును సాధించి ఐపీఎస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు.
చంద్రబాబు ప్రశంసలు
2025 ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో కానిస్టేబుల్ యూనిఫాంలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఫోటోతో కూడిన ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఆ పోస్ట్కు పెట్టిన క్యాప్షన్లో ఇలా ఉంది. ‘‘కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం. ధైర్యం, నిరంతర కృషి లేకుండా ఏ కల కూడా పెద్దది కాదని నిరూపిస్తుంది. సంకల్పం ప్రతి అడ్డంకిని ఛేదించి.. ఒక కొత్త గమ్యాన్ని సృష్టించగలదని ఆయన కథ మనకు గుర్తు చేస్తుంది. ఎప్పటికీ వదులుకోని వారిదే భవిష్యత్తు..’’ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు పోస్ట్కు ఉదయ్ రీపోస్ట్ చేస్తూ ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి గుర్తింపు, ప్రశంసలు అందుకోవడం నాకు చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు సార్. మీ కృషి, దార్శనిక నాయకత్వం నన్ను నిజంగా ప్రేరేపించాయి సార్.’’ అంటూ ఉదయ్ పేర్కొన్నారు.
వివాదంలోకి..
ఇంత కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డిని వివాదాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఆయనతో పాటు శిక్షణ పొందుతున్న ఒక మహిళా ఐపీఎస్ లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 2026 జూలై 18న హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మరుసటి రోజే జూలై 19న ఉదయ్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో లభించిన ఆత్మహత్య లేఖలో మహిళా అధికారి చేసిన ఆరోపణలన్నింటినీ ఉదయ్ ఖండించారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఇరుపక్షాల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాల ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఈ కేసుపై సమగ్ర న్యాయ విచారణ జరుపుతున్నారు. అనాథగా పెరిగి.. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఉదయ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉదయ్ హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఏం తీర్పు వెలువరిస్తుందో చూడాలి.

