NTV Telugu Site icon

Rahul Gandhi: మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

Rahulgandhi

Rahulgandhi

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠా దిగ్గజానికి అవమానకరమని అన్నారు. ఆగస్టు 26న కుప్పకూలిన ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించారు. గురువారం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ.. విగ్రహం నిర్మించిన కొద్ది నెలలకే కూలిపోయిందని దుయ్యబట్టారు. ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. శివాజీ మహారాజ్ విగ్రహం కూలినందుకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారని, తప్పు చేసిన వ్యక్తి క్షమాపణలు చెప్పాలన్నారు. తప్పు చేసేవాడు క్షమాపణలు చెబుతాడు.. మీరు ఏ తప్పు చేయకుంటే ఎందుకు క్షమాపణలు చెబుతారు? అని ప్రధాని మోడీని రాహుల్ నిలదీశారు.

‘‘మోడీ ఎందుకు క్షమాపణలు చెప్పారో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. మొదట మోడీ విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్ట్‌ను ఆర్‌ఎస్ఎస్ క్యాడర్‌కు ఇచ్చారు. బహుశా అతను అలా చేయకూడదని అతను భావించి ఉండవచ్చు. ఆ కాంట్రాక్టర్ మోసం చేసి మహారాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడని ప్రధాని భావించి ఉండవచ్చు.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శివాజీ మహారాజ్‌కి మాత్రమే కాకుండా మహారాష్ట్ర ప్రజలకు కూడా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఆగస్ట్ 30న పాల్ఘర్‌లో చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పాటు ఆయన అనుచరులు మరియు ఆయనను దేవతగా గౌరవించే వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఇక బుధవారం మహారాష్ట్ర పోలీసులు థానే జిల్లాలోని కళ్యాణ్‌లో విగ్రహం కూలిన ఘటనకు సంబంధించి శిల్పి-కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టేను అరెస్టు చేశారు. 24 ఏళ్ల శిల్పి విగ్రహం కూలిన తర్వాత 10 రోజుల పాటు జాడ తెలియకుండా పోయింది.