ఆరోగ్యకర భారతం కలలు సాకారం చేయాలనే తపనతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని.. భారత్లో ఆరోగ్యం, అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే సంప్రదాయం గతంలో లేకపోయినా.. ఇప్పుడు ఆ పని విజయవంతంగా ప్రధాని మోడీ చేస్తున్నారని.. మంచి ఫలితాలను సైతం సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ.. ఢిల్లీలో ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్దేశ ఆరోగ్య బడ్జెట్ రూ.2.40 లక్షల కోట్లకు పెంచారని గుర్తుచేశారు.. ఇక, హెల్త్ సెక్టార్లో ఎయిమ్స్ ఒక లైట్హైస్గా కొనియాడిన కేంద్ర మంత్రి.. ప్రజలకు ఎయిమ్స్పై ఎంతో నమ్మకం ఉందని, పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 22 ఎయిమ్స్ల ప్రారంభోత్సవానికి పనులు జరుగుతున్నట్టు వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గులేరియా మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు శిక్షణతో పాటు, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాం అని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో మా విజయాల కొనసాగింపుగా, ఎయిమ్స్ ఢిల్లీ మళ్లీ దేశంలో నంబర్ 1 మెడికల్ కాలేజీగా ర్యాంక్ పొందిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ గులేరియా..
