Railways Ticket Cancellation Rules: టికెట్ రద్దులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల ద్వారా భారతీయ రైల్వే ఎంత ఆదాయం పొందుతుందనే అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, టికెట్ రద్దు ఛార్జీలు లేదా రద్దు చేయని వెయిటింగ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి జోన్ల వారీగా భారతీయ రైల్వే ఎలాంటి ప్రత్యేక రికార్డులను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హండోరే అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. గత మూడు సంవత్సరాల్లో టికెట్ రద్దు రుసుములు, వెయిటింగ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై సమాచారం కోరగా, అలాంటి గణాంకాలు జోన్ల వారీగా నమోదు చేయడం లేదని తెలిపారు.
టికెట్ రద్దు నిబంధనల విషయానికొస్తే, సాధారణ రైళ్లలో ప్రయాణానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేస్తే క్లాస్ను బట్టి రూ.240 నుంచి రూ.60 వరకు రద్దు రుసుము వసూలు చేస్తారు. 48 గంటల నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం, 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం కోత విధిస్తారు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. ఇక, వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్లను రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు రద్దు చేసుకోవచ్చు. అనంతరం ప్రతి ప్రయాణికుడికి రూ.60 క్లర్కేజ్ ఛార్జీ విధిస్తారని వెల్లడించారు..
ఇక వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రత్యేక రద్దు నిబంధనలు అమల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ రైళ్లలో నకిలీ లేదా ఊహాజనిత బుకింగ్లను అరికట్టేందుకు ప్రత్యేక రీఫండ్ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రయాణానికి 72 గంటల ముందు రద్దు చేస్తే 25 శాతం, 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం కోత విధిస్తారు. రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు అని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

