Site icon NTV Telugu

Iran-India: సోనియాగాంధీ ఎఫెక్ట్.. 6 రోజుల తర్వాత ఖమేనీ మృతిపై భారత్ సంతాపం

Iranindia

Iranindia

గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ హతం చేసింది. ఆయన చనిపోయినట్లుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కానీ భారత ప్రభుత్వం ఖండించలేదు. సంతాపం వ్యక్తం చేయలేదు. దీంతో కేంద్రం తీరును కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. ఖమేనీ మృతికి ఎందుకు సంతాపం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కాలమ్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపింది.

తాజాగా 6 రోజుల తర్వాత ఖమేనీ మృతి పట్ల భారత ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లారు. ఇరాన్ రాయబార కార్యాలయంలోని సంతాప పుస్తకంలో సంతకం చేసి హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి సంతాపం తెలిపారు. ఇక ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఇరాన్ జెండాను సగానికి అవనతం చేసింది.

ఇటీవల ఖమేనీ హత్యపై భారత ప్రభుత్వం స్పందించకపోవడం అంతర్జాతీయ న్యాయ, సార్వభౌమత్వానికి విరుద్ధమని సోనియాగాంధీ తెలిపారు. ఇది మౌన సమ్మతిగా భావించబడే ప్రమాదంగా ఉందని చెప్పారు. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఒక దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్రమైన విఘాతంగా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో భారత్ స్పష్టంగా సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు మద్దతు ఇవ్వకపోవడం దేశ విదేశాంగ విధాన దిశపై సందేహాలు కలిగిస్తోందన్నారు. ఆశ్చర్యంగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను మాత్రం ప్రధాని మోడీ ఖండించారని.. కానీ వాటికి దారితీసిన పరిణామాలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఖమేనీ హత్యకు కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌ను సందర్శించి.. నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం సమయస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా వంటి దేశాలు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్న సమయంలో భారత్ వైఖరి సంప్రదాయ విదేశాంగ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బడ్జెట్ సమావేశాల రెండో విడతలో పార్లమెంటులో చర్చ నిర్వహించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో సోనియాగాంధీ నిలదీశారు. ఇది పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపడంతో ఆలస్యంగా భారత ప్రభుత్వం సంతాపం తెలిపింది.

 

Exit mobile version