India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!

  • త్వరలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం
  • కీలక హామీ కోరుతున్న భారత్
Modi

Modi

భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జూలై తర్వాత భారత ఎగుమతులపై అమెరికా అమలు చేయనున్న కొత్త సుంకాలపై స్పష్టత వచ్చిన వెంటనే ఒప్పందం తొలి దశను ఖరారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం సుంకం జూలైలో ముగియనుండటంతో ఆ తర్వాత భారత్‌పై ఏ స్థాయి సుంకాలు విధిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

చర్చల్లో పాల్గొంటున్న ఒక ప్రభుత్వ అధికారి ప్రకారం.. జూలై తర్వాత అమెరికా సాధారణ MFN (Most Favoured Nation) సుంకాలను మాత్రమే అమలు చేయగలదని, అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) సెక్షన్ 301 కింద కొత్త సుంకాలను ఖరారు చేస్తే అవే అమలులోకి వస్తాయని తెలిపారు. “ఆ సుంకాలపై స్పష్టత వచ్చిన వెంటనే వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయవచ్చు. అయితే ఆ రేటు ఇతర పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు అనుకూలంగా ఉండాలి” అని పేర్కొన్నారు.

×
×
Ad

అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం.. భాగస్వామ్య దేశాల అన్యాయ వాణిజ్య విధానాలపై విచారణ జరిపి సుంకాలు విధించే అధికారం వాషింగ్టన్‌కు ఉంది. ఇదే క్రమంలో జూన్ 2న USTR భారత్‌తో పాటు మరో 53 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 12.5 శాతం సుంకం విధించాలని ప్రతిపాదించింది. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల నియంత్రణలో తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా.. జూలైలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఇక భారత్ ఒక కీలక హామీ కూడా కోరుతోంది. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌పై మరోసారి సెక్షన్ 301 కింద విచారణలు ప్రారంభించబోమని అమెరికా భరోసా ఇవ్వాలని ఢిల్లీ కోరుతున్నట్లు సమాచారం. జూన్ 2 నుంచి 4 వరకు ఢిల్లీలో జరిగిన తాజా భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో మార్కెట్ యాక్సెస్, సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులు, కస్టమ్స్ సౌలభ్యం, భవిష్యత్ వాణిజ్య ఒప్పంద రూపకల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఇదిలా ఉండగా భారత్-బ్రిటన్ మధ్య గత ఏడాది కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమలుపై కూడా పురోగతి నమోదైంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ వ్యాపార-వాణిజ్య కార్యదర్శి పీటర్ కైల్ మధ్య జరిగిన చర్చల్లో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావనకు రాగా.. వాటిలో ఒకటి పరిష్కారమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే బ్రిటన్ ఇటీవల పొడిగించిన స్టీల్ రక్షణ చర్యలు (Steel Safeguards), అలాగే అమలు చేయబోయే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (CBAM)పై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్యలు వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే మార్కెట్ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని భావిస్తోంది. దీంతో ఈ అంశాలపై కూడా రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి.