Site icon NTV Telugu

Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!

Monsoon Season

Monsoon Season

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ఠారెత్తిస్తున్నాడు. మధ్యాహానానికి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ నెల కూడా ముగిసిపోతుంది. మే నెల రాబోతుంది. రోహిణి కార్తె వస్తుందంటే పరిస్థితులు ఎలా ఉండబోతాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ నుంచి గుడ్‌న్యూస్ వచ్చింది.

ఈ ఏడాది ముందుగానే భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించొచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) తాజాగా అంచనా వేసింది. వేడి ఉపశమనం నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చని అభిప్రాయపడింది. మే నెలాఖరు సమయానికి వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ పరిణామం అన్నదాతలకు, ప్రజలకు శుభ పరిణామంగానే చెప్పొచ్చు.

2025లో కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మే 27-29 తేదీల్లో వర్షాలు కురవవచ్చని మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లో అనుకున్న సమయం కంటే ముందే వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మే 18-25 మధ్యన అండమాన్-నికోబార్ దీవుల్లో రుతుపవనాలు చేరుకోవచ్చని చెప్పారు.

ప్రస్తుతం నైరుతి దిశ నుంచి వీచే బలమైన గాలులు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంపై బలపడుతున్నాయని దేవేంద్ర త్రిపాఠి సూచించారు. ఈ గాలుల కారణంగా ఆ వారంలో ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీనివల్ల సాధారణం కంటే 30 నుండి 60 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

మే 25 నుంచి జూన్ 1 వరకు రుతుపవనాలు పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తుందని అంచనా వేశారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై బలమైన పశ్చిమ గాలులు ఏర్పడి.. తేమను నేరుగా భారతదేశ నైరుతి తీరం వైపు మళ్లిస్తాయని భావిస్తున్నారు. దీని కారణంగా కేరళ, తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వచ్చే సమయానికి ఎల్ నినో ఉండదని అధికారి తెలిపారు.

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వేడితో చిన్నారుల, వృద్ధులు అల్లాడిపోతున్నారు. త్వరగా రుతుపవనాలు వస్తే ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అన్నదాతలకు కూడా శుభ పరిణామమే.

 

Exit mobile version