పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. సంక్షోభం కారణంగా దేశాలు గజగజలాడుతున్నాయి. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. అదే కోవలో భారత్ కూడా అమలు చేస్తోంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు.
ఇప్పుడు విదేశీ ప్రయాణాలను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధపడుతోంది. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సెస్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాల సమాచారం. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను, సెస్ లేదా సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రాలకు పంచే డివిజిబుల్ పూల్లో ఈ నిధులు చేరవని సమాచారం. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం ఈ అదనపు పన్ను తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు అమలులో ఉండే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, దిగుమతి వ్యయాలను తగ్గించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని నియంత్రించాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో దేశ దిగుమతి భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. ఫలితంగా విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, విదేశీ రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఇక భారత పర్యాటక రంగం ప్రస్తుతం 231.6 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద రంగంగా ఉంది. వచ్చే దశాబ్దంలో ఇది నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారతీయుల విదేశీ పర్యటనల మార్కెట్ 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ ప్రచారాన్ని మళ్లీ బలోపేతం చేసి విదేశీ పర్యాటకులను భారత్కు ఆకర్షించాలని పర్యాటక రంగ ప్రతినిధులు కేంద్రానికి సూచిస్తున్నారు. విదేశీ మారక నిల్వలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
