Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

  • దేశ రక్షణ శాఖ మరింత బలోపేతం
  • అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
  • ‘అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ మంజూరు
Rajnath Singh

Rajnath Singh

దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జూలై 3న జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో సుమారు రూ.52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ‘అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ మంజూరు చేసింది. దీంతో భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి అత్యాధునిక ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోలుకు సూత్రప్రాయ పరిపాలనా అనుమతి లభించింది.

భారత భూసేన కోసం పలు కీలక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. వీటిలో..

AKASH TARANG యాంటీ-డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్
మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్ (MPATGM)
మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ (MRSAM)
వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (V-SHORADS)
ట్యాంకుల కోసం యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్
జెట్ ఆధారిత కామికాజే డ్రోన్ వ్యవస్థ వంటి కీలక వ్యవస్థలు ఉన్నాయి.

ఆకాశ తరంగ్ వ్యవస్థ శత్రు డ్రోన్లను సమర్థంగా గుర్తించి నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. MPATGM ద్వారా కాల్బలగాల యాంటీ-ట్యాంక్ సామర్థ్యం పెరుగుతుంది. MRSAM వ్యవస్థ మధ్యశ్రేణి వైమానిక ముప్పులను సమర్థంగా ఎదుర్కొంటుంది. అదేవిధంగా V-SHORADS మల్టీ-స్పెక్ట్రల్ సెన్సింగ్ సాంకేతికతతో శత్రు వైమానిక దాడులను మరింత సమర్థంగా అడ్డుకుంటుంది. ట్యాంకుల కోసం యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వాటి రక్షణను, మనుగడ సామర్థ్యాన్ని పెంచుతుంది. జెట్ ఆధారిత కామికాజే డ్రోన్లు అధిక విధ్వంసక శక్తితో పాటు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి.

భారత నౌకాదళం కోసం కూడా పలు ఆధునిక వ్యవస్థలకు అనుమతి లభించింది. వాటిలో..

మల్టీ ఇన్‌ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ (MIGM)
నావల్ షిప్‌బోర్న్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ (NSUAS)
ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ కోసం ల్యాండ్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీ (LBTF) ఉన్నాయి.

MIGM ద్వారా శత్రు నౌకల కదలికలను అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుంది. అత్యాధునిక సెన్సర్లతో కూడిన NSUAS సముద్ర పర్యవేక్షణ, పరిస్థితుల అవగాహనను మరింత మెరుగుపరుస్తుంది. LBTF ద్వారా నౌకాదళానికి సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపల్షన్ వ్యవస్థల పరీక్షలు దేశీయంగానే నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. భారత వైమానిక దళం కోసం ఫిక్స్‌డ్ వింగ్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ ప్సూడో శాటిలైట్ (FW-HAPS) కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.

ఈ వ్యవస్థ ద్వారా దీర్ఘకాలికంగా..

ఇంటెలిజెన్స్ సేకరణ (Intelligence)
నిఘా (Surveillance)
రికానైసెన్స్ (Reconnaissance)
టెలికమ్యూనికేషన్
రిమోట్ సెన్సింగ్ వంటి కీలక కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించవచ్చని రక్షణ శాఖ వెల్లడించింది. రూ.52 వేల కోట్ల ఈ రక్షణ కొనుగోళ్లతో భారత సాయుధ దళాల ఆధునికీకరణకు మరింత వేగం చేకూరుతుందని.. దేశ భద్రతా సామర్థ్యం గణనీయంగా బలోపేతం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.