Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు హైదరాబాదీలు మృతి..

  • ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు..
  • చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగి ఇద్దరు మృతి..
  • హైదరాబాద్‌కు చెందిన యాత్రికులుగా గుర్తించిన పోలీసులు..
Uttarakand

Uttarakand

Uttarakhand: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్‌ మధ్యలోని బద్రీనాథ్‌ నేషనల్ హైవేపై ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్‌ షాహీ, సత్య నారాయణ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపోయి వారిపై పడడటంతో.. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Read Also: BRS MLA Into Congress: కాంగ్రెస్‌ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!

కాగా, భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌ నేషనల్ హైవే పలు చోట్ల ధ్వంసమైపోవడంతో రాకపోకలు స్తంభించింది. రుద్ర ప్రయాగ్‌- కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసి చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రుద్ర ప్రయాగ్‌లో అన్ని స్కూళ్లకు ఇవాళ (శనివారం) సెలవు ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.