పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు తర్వాత రాష్ట్రంలో నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. హౌరా నగరంలో పేరుమోసిన నేరస్థుడు ఆకాష్ సింగ్ను హౌరా పోలీసులు అదుపులోకి తీసుకుని లోదుస్తుల్లో వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఆకాష్ సింగ్ను మాలిపంచ్ఘరా, గోలబారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు నేరస్థలాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు.
గతంలో జరిగిన నేరాలను ఛేదించే క్రమంలో, అతను నేరాలను ఎలా ప్లాన్ చేశాడు? ఎవరి సహాయం తీసుకున్నాడు? వంటి అంశాలపై దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడిని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు, ఘటనలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
అధికార మార్పు తర్వాత వేగంగా చర్యలు
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది. పార్టీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో నేరాలపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా నేరస్థులపై వేగంగా చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ ఆక్రమణలపై కూడా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.
