NTV Telugu Site icon

IMD Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. జాబితా విడుదల

Imdalert

Imdalert

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఐఎండీ ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం 28 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలోని ఐదు జిల్లాల్లో సెప్టెంబర్ 8న భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెంలో అత్యంత భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది.

ఐఎండీ ప్రకారం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉంది. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌తో సహా ఎన్‌సీఆర్‌లోని కొన్ని చోట్ల వర్షం పడవచ్చు. రుతుపవనాలు మరోసారి బలపడటంతో రాజస్థాన్ రాజధాని జైపూర్ సహా పలు జిల్లాల్లో శనివారం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో తూర్పు రాజస్థాన్‌లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ రాజస్థాన్‌లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది. తూర్పు రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 8న ఉదయపూర్, అజ్మీర్, జైపూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 8-9 తేదీలలో కోట, అజ్మీర్, జైపూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలో మణిపూర్, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్‌లు కూడా ఉన్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల పాటు బీహార్‌లో రుతుపవనాలు బలమైన స్థితిలో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10 వరకు బీహార్ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.