NTV Telugu Site icon

Heavy Rains: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 60 మంది మృతి

Heavy Rains

Heavy Rains

Heavy Rains: హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల్లో 60 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు కొంచచరియలు విరిగిపడుతుండడంతో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సంతో నేడు, రేపు స్కూల్స్‌కి సెలవులు ప్రకటించారు. కొద్ది రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Read also: Multibagger Stock : రూపాయి పెట్టి కొనుంటే ఇప్పుడు ఆ బ్యాంక్ మిమ్మల్ని కోటీశ్వరులను చేసేది

హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, జార్ఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ట భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో 55 మంది చెందారు. రానున్న 24 గంటల్లో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్‌ అలర్ట్‌ను విధించారు. భారీ వర్షాల కారణంగా కాంగ్రా జిల్లాలో నేడు(బుధవారం), రేపు(గురువారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హిమాచల్‌ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 440 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న అధికారులు.. నదులు మరియు కాలువల దగ్గరకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ ప్రజలను ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రంలోని టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని ఆయన కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రైవేట్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ధ్వంసమైంది. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్‌దామ్‌ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.