Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?

Göbekli Tepe

Göbekli Tepe

Göbekli Tepe: ఈజిప్టు పిరమిడ్లు అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన అద్భుత కట్టడాలు గుర్తొస్తాయి. అయితే పిరమిడ్లు నిర్మించడానికి వేల సంవత్సరాల ముందే మనుషులు భారీ రాతి స్తంభాలతో అద్భుతమైన నిర్మాణాలు కట్టారంటే నమ్మగలరా? అప్పటికి వ్యవసాయం కూడా పూర్తిగా మొదలుకాలేదు. మనుషులు ఎక్కువగా వేటాడుతూ, అడవుల్లో తిరుగుతూ జీవించేవారు. అలాంటి సమయంలోనే వేల కిలోల బరువున్న రాళ్లను కట్ చేసి, వాటిపై జంతువుల బొమ్మలు చెక్కి, వాటిని ఒక క్రమంలో నిలబెట్టారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొంతకాలం తర్వాత ఆ నిర్మాణాలను వాళ్లే మట్టితో కప్పేశారు. అసలు ఎందుకు అలా చేశారు? ఆ ప్రదేశంలో ఏం జరిగేది? ఇదే గోబెక్లి టెపే చుట్టూ ఉన్న పెద్ద మిస్టరీ.

గోబెక్లి టెపే టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. దాదాపు 11,500 ఏళ్ల క్రితం ఇక్కడ భారీ రాతి నిర్మాణాలు ఏర్పడ్డాయని పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. UNESCO ప్రకారం, ఈ నిర్మాణాలను క్రీ.పూ. 9600 నుంచి 8200 మధ్యకాలంలో వేటాడుతూ, ఆహారం సేకరించుకుంటూ జీవించే సమూహాలు నిర్మించాయి. ఈ కారణంగానే గోబెక్లి టెపేను మానవ చరిత్రలోనే తొలి భారీ స్మారక నిర్మాణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ఒకటిగా చూస్తారు.

ఇక్కడికి వెళ్లినప్పుడు ముందుగా కనిపించేది భారీ T ఆకారపు రాతి స్తంభాలు. కొన్ని స్తంభాలు 5.5 మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. వాటిపై పాములు, నక్కలు, తేళ్లు, రాబందులు, ఇతర అడవి జంతువుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఈ బొమ్మలు చూస్తే అప్పటి మనుషులు కేవలం రాళ్లు పెట్టి నిర్మాణం చేయలేదని అర్థమవుతుంది. వాటి మీద ఎంతో శ్రద్ధ పెట్టి చెక్కారు. అప్పటి ప్రజలకు ఏం తెలుసు, ఎలాంటి నమ్మకాలు ఉండేవి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ బొమ్మలు ఇప్పుడు పరిశోధకులకు చాలా ఉపయోగపడుతున్నాయి.

టర్కీలోని ఆగ్నేయ అనటోలియా ప్రాంతంలో ఉన్న గోబెక్లి టెపే ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలయంగా భావిస్తున్నారు. దాదాపు 11,500 సంవత్సరాల రాతియుగపు వేటగాళ్లు ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఈజిప్ట్ పిరమిడ్లు, బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్ కంటే వేల ఏళ్ల పూర్వానికే చెందినది కావడంతో మానవ నాగరికత చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన ఆవిష్కరణగా నిలిచింది.

అయితే ప్రారంభంలో దీనిని కేవలం ఒక కల్ట్ పూజా స్థలంగానే భావించినప్పటికీ, తాజా తవ్వకాలలో ఇక్కడ నివాస గృహాలు, వంట చేసుకునే రాతి పాత్రలు, వర్షపు నీటిని నిల్వ చేసుకునే వసతులు కూడా బయటపడ్డాయి. దీనివల్ల ఇది కేవలం దేవుడిని పూజించే ఆలయం మాత్రమే కాదని, ఆ కాలపు మనుషులు కలిసి నివసించిన ఒక పురాతన సామాజిక నివాస ప్రాంతం కూడా కావచ్చు అని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఆధునిక అర్థంలో మనం చూసే గుడి లాంటిది కాకపోయినా, చరిత్రపూర్వ కాలంలో మానవులందరినీ ఒకచోటకు చేర్చిన ఒక కమ్యూనిటీ లేదా ఆధ్యాత్మిక కేంద్రం అని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలు ఆశ్చర్యం మొదలవుతుంది. అప్పట్లో మనుషుల దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా క్రేన్లు, భారీ యంత్రాలు, ఆధునిక పనిముట్లు ఏవీ లేవు. అయినా ఇంత పెద్ద రాళ్లను కొండ నుంచి తీసుకొచ్చి, వాటిని చెక్కి, సరైన చోట నిలబెట్టారు. UNESCO వివరాల ప్రకారం ఈ రాతి స్తంభాలను అక్కడి సున్నపురాయి ప్రాంతం నుంచే తీసుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. రాళ్లను ఎలా కట్ చేశారు, ఎలా లాగి తీసుకొచ్చారు, ఎంతమంది కలిసి ఈ పనులు చేశారు అనే విషయాలపై మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ఇక మనిషి నాగరికత ఎలా మొదలైందన్న మన ఆలోచనలనే గోబెక్లి టెపే మార్చేసింది. చాలా కాలం వరకు మనుషులు మొదట వ్యవసాయం నేర్చుకున్నారు, ఆ తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం మొదలుపెట్టారు, తర్వాతే పెద్ద సామాజిక నిర్మాణాలు వచ్చాయని భావించేవారు. కానీ గోబెక్లి టెపేలో కనిపిస్తున్న ఆధారాలు ఈ కథ అంత సింపుల్ కాదని చెబుతున్నాయి. వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి చెందకముందే ఇంత పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి మనుషులు ఒకచోట చేరి పనిచేశారు. అంటే అప్పటి సమాజంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయి సహకారం, ప్రణాళిక ఉండి ఉండొచ్చు.

ఇక ఈ ప్రదేశంలో ఇప్పటికీ అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచే విషయం దాన్ని పూడ్చేయడమే. అక్కడి నిర్మాణాలు ఒకసారి నిర్మించి వదిలేయలేదు. వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించారు. తర్వాత కొన్ని దశల్లో వాటిని మట్టి, ఇతర పదార్థాలతో కప్పేశారు. UNESCOకి సంబంధించిన రీసెర్చ్ ప్రకారం ఈ నిర్మాణాలు దాదాపు 1,500 సంవత్సరాల కాలంలో తిరిగి నిర్మించబడి, ఉపయోగించబడి, ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా పూడ్చబడినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్లు ఎందుకు పూడ్చారన్నదే ఇప్పటికీ పెద్ద ప్రశ్న. ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ప్రదేశాన్ని శాశ్వతంగా మూసేయాలనుకున్నారా? లేక అప్పటి ఆచారాల్లో భాగంగానే ఇలా చేశారా? దీనికి ఇప్పటివరకు ఒక్క ఖచ్చితమైన సమాధానం లేదు.

1990ల మధ్యకాలం నుంచి ఇక్కడ పురావస్తు తవ్వకాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రతి కొత్త తవ్వకంతో అప్పటి మనుషుల జీవితం గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ మొత్తం ప్రదేశం పూర్తిగా బయటపడలేదు. అంటే మనం చూస్తున్నది ఈ భారీ మిస్టరీలో ఒక భాగం మాత్రమే. అందుకే గోబెక్లి టెపే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, పురావస్తు పరిశోధకులను ఆకర్షిస్తోంది. పిరమిడ్లు కంటే వేల సంవత్సరాల ముందు మనుషులు ఇలాంటి భారీ నిర్మాణాలు ఎలా చేశారు? వాళ్లను ఇంత పెద్ద పని చేయడానికి ఏ నమ్మకం ప్రేరేపించింది? రాళ్లపై జంతువుల బొమ్మలు ఎందుకు చెక్కారు? చివరికి తమ చేతులతో నిర్మించిన ప్రదేశాన్నే ఎందుకు మట్టిలో దాచేశారు? ఈ ప్రశ్నలకు భవిష్యత్తులో మరిన్ని ఆధారాలు దొరకవచ్చు.