Site icon NTV Telugu

UP Polls 2022: నాల్గో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఉత్తరప్రదేశ్‌లో నాలుగోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగో ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. తొలి మూడు ద‌శ‌ల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జ‌రిగింది. ఇక నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో 624 మంది అభ్యర్ధులు త‌మ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి ప‌ట్టున్న ల‌క్నో, రాయ్‌బ‌రేలి ప్రాంతాల్లో ఇదే విడ‌త పోలింగ్‌ జ‌ర‌గ‌నుండ‌టంతో నాలుగో ద‌శ ఆయా పార్టీల‌కు రాజకీయంగా కీల‌కంగా మారింది. అవ‌ధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేప‌డుతుంద‌ని గ‌త రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిర్ధార‌ణ కావ‌డంతో నాలుగో ద‌శ పోరును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మరోవైపు బుధవారం జరిగే పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Read Also: Putin: ఉక్రెయిన్‌ వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా

అధికార బీజేపీకీ, విపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో మరో విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువస్ధానాలు గెల్చుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో ప్రియాంక గాంధీ ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకుని మహిళల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ లక్నోలో ప్రియాంక.. రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల పాటు ఉత్తరప్రదేశ్ భవిష్యత్ నిర్ణయిస్తాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన మద్దతు ధర దక్కడంలేదని ఆరోపించారు. మరోవైపు మణిపూర్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మణిపూర్‌ సంప్రదాయం, వాటిని కాంగ్రెస్ తప్పకుండా కాపాడుతుందని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు రాహుల్.

Exit mobile version