మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ మరోసారి ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏడు సంవత్సరాల క్రితమే తాను రాజీనామా సమర్పించినప్పటికీ ఇప్పటికీ దానిని ప్రభుత్వం ఆమోదించలేదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ప్రధానిని ట్యాగ్ చేస్తూ గోపీనాథన్ చేసిన పోస్టులో.. ‘‘ప్రియమైన ప్రధాని మోడీ గారూ.. ఇప్పుడు మీరు రాజీనామాలను ఆమోదించడం ప్రారంభించారు కాబట్టి.. దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండి. దానికి ఇప్పటికే ఏడు సంవత్సరాలు అయ్యాయి.’’ అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు
తన పోస్టుపై స్పందించిన నెటిజన్ల ప్రశ్నలకు గోపీనాథన్ వ్యంగ్యంగా సమాధానాలు ఇచ్చారు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికీ ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘లేదు. జీతం లేదు.. సస్పెన్షన్ కూడా లేదు.. ఏమీ లేదు. మిగతా అన్ని అంశాల మాదిరిగానే నా రాజీనామాను కూడా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది.’’అని వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ విజ్ఞప్తి చేయాలని సూచించగా.. ‘‘కెమెరా యాంగిల్ సెట్ చేస్తున్నా.. కొత్త టెలీప్రాంప్టర్ తెప్పిస్తున్నా.’’ అంటూ ప్రధాని ప్రసంగ శైలిపై పరోక్షంగా విమర్శించారు. దీనికి మరో నెటిజన్ మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్స్ కూడా సిద్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించగా.. ‘‘వాళ్లందరూ ఇప్పటికే రాజీనామా చేశారు.’’ అంటూ మరోసారి వ్యంగ్యంగా స్పందించారు.
రాజీనామా ఎందుకు?
2012 బ్యాచ్కు చెందిన ఏజీఎంయూటీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కన్నన్ గోపీనాథన్ 2019లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నానని అప్పట్లో వెల్లడించారు. ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే తన రాజీనామాకు ప్రధాన కారణమని పలు సందర్భాల్లో చెప్పారు.
ఇక 2025లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కూడా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370 రద్దు చేయడం ప్రభుత్వ నిర్ణయం కావచ్చు. కానీ ఒక రాష్ట్రాన్ని పూర్తిగా మూసివేయడం, జర్నలిస్టులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులను నిర్బంధించడం, రవాణా, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సరైనదా?’’ అని ప్రశ్నించారు. ఇక 2018లో కేరళ వరదల సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం, పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
2019లో రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దానిని అధికారికంగా ఆమోదించలేదు. గతంలో వెలువడిన నివేదికల ప్రకారం.. ఆయన రాజీనామాకు సంబంధించిన తుది సిఫార్సు ఇంకా సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపించకపోవడంతో ఆ వ్యవహారం కేంద్ర హోంశాఖ దగ్గరే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
2025 అక్టోబర్లో గోపీనాథన్ మాట్లాడుతూ.. తనపై ప్రారంభించిన క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ‘‘ప్రభుత్వంలో సాంకేతికంగా ఉద్యోగిగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించానని యూపీఎస్సీ తెలిపింది. అందుకే నా పే స్కేల్ తగ్గిస్తామని చెప్పారు. కానీ నేను ఏ జీతమూ తీసుకోవడం లేదు. మరి ఏ పే స్కేల్ తగ్గిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు.
ఇక గోపీనాథన్ వ్యవహారాన్ని తరచుగా మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ కేసుతో పోలుస్తుంటారు. షా ఫైసల్ రాజీనామా కూడా చాలా కాలం పెండింగ్లో ఉండగా.. అనంతరం 2022లో ఆయన తిరిగి ప్రభుత్వ సేవలో చేరారు. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై రాజీనామా మాత్రం 2019లోనే ఆమోదం పొందింది. అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి కీలక నేతగా కొనసాగుతున్నారు.

