దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికారులతు తీవ్ర కసరత్తు చేస్తోంది. గత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి భిన్నంగా పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇక మద్యం తాగే వయసును కూడా కుదించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు 25 ఏళ్ల వయసు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదించే అవకాశం ఉంది. ఇకపై 21 ఏళ్లకే మద్యం సేవించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: గాజాపై ట్రంప్ ప్లాన్ను స్వాగతించిన పాక్.. మండిపడుతున్న స్వదేశీయులు
దాదాపు కొత్త లిక్కర్ పాలసీ సిద్ధమైనట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మద్యం తాగే వయసును తగ్గిస్తారా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ 21కు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీలపై నిషేధం ఎత్తేస్తారా? లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేనట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధానిలోని అన్ని రిటైల్ మద్యం దుకాణాల్లో ప్రీమియం మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడంపై కూడా చర్చ జరిగింది. కొత్త ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఒకే ధరలో విక్రయించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Stalin: కరూర్ను ఒకలా.. మణిపూర్ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
కొత్త లిక్కర్ పాలసీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీమియం బ్రాండ్లు అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా కస్టమర్లకు కొత్త బ్రాండ్లు కూడా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికి నెలలో ప్రణాళిక ప్రవేశపెట్టనున్నారు.
2021లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. అయితే రేఖా గుప్తా ప్రభుత్వం రాగానే కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో భారీ అక్రమాలు, అవినీతి చోటుచేసుకోవడంతో ఉపసంహరించుకున్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు జైలు పాలయ్యారు.
