Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..

  • కేరళ రాజకీయాల్లో హైడ్రామా
  • సీపీఐ(ఎం) కార్యకర్తల తీవ్ర నిరసన
Ed Raid Kerala

Ed Raid Kerala

Pinarayi Vijayan: కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. కన్నూర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు ముగించుకుని బయటకు వస్తున్న ఈడీ అధికారులను సీపీఐ(ఎం) కార్యకర్తలు అడ్డుకోవడంతో విజయన్ నివాసం వద్ద హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది.

గేటు వద్ద ఉద్రిక్తత.. 
ఈడీ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పార్టీ కార్యకర్తలు గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడ కాసేపు తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటకుండా చూసేందుకు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, స్థానిక పదాధికారులు రంగంలోకి దిగి, కార్యకర్తలను శాంతింపజేసి అధికారులను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనాలపై రాళ్లు వేశారు.

ఇది రాజకీయ కక్షసాధింపే
పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడిని సీపీఐ(ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం, ఈడీ లక్ష్యంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ చర్య పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. “దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేశారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి ఊరటనివ్వడం చూశాం. కేరళలో జరుగుతున్న ఈడీ సోదాలు కూడా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌ల రాజకీయ వ్యూహంలో భాగమే” అని అన్నారు.

ఈడీ ఇప్పుడు స్వతంత్ర సంస్థ కాదు
ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థలా పనిచేయడం లేదని, అది పూర్తిగా “ఆర్‌ఎస్‌ఎస్ – బీజేపీ ప్రభుత్వ రాజకీయ యంత్రాంగం” గా మారిపోయిందని బేబి మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈడీ చర్యతో కేరళం వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజాస్వామ్య సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందంటూ సీపీఐ(ఎం) కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగారు.