E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం

  • ఈ20 పెట్రోల్‌పై రగడ
  • ఈ20 పెట్రోల్‌ నిలిపేయాలని డిమాండ్
  • ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
E20petrol

E20petrol

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌పై రగడ నడుస్తోంది. ఈ 20 పెట్రోల్ కారణంగా ఇంజిన్ పాడవుతోందని.. వెంటనే నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేజ్రీవాల్ నాయకత్వంలో ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇలాంటి తరుణంలో ఈ20 పెట్రోల్ వాడకంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ నాణ్యత, కలుషితానికి సంబంధించిన ఆందోళనలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ కీలక వివరణ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో, పలు మీడియా కథనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలో అమలు చేస్తున్న కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలను కేంద్రం వెల్లడించింది. వాహన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన నాణ్యతను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేసింది.

ఇప్పటికే అమల్లో ఉన్న పరీక్షా విధానాలతో పాటు.. ఇంధనంలో కల్తీ, కలుషితాన్ని అడ్డుకునేందుకు అదనపు తనిఖీలను కూడా చేపట్టినట్లు పెట్రోలియం శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు ఇంధనంలోకి నీరు చేరిందా లేదా అనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితాన్ని గుర్తించేందుకు ఇప్పటివరకు 2 వేలకుపైగా ఇంధన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే క్లోరైడ్ కలుషితానికి సంబంధించిన వేర్వేరు ఘటనలు గుర్తించినట్లు తెలిపింది. ఆ రెండు పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇంధనంలో కలుషితం లేదా కల్తీకి పాల్పడినట్లు తేలిన ఏ రిటైల్ అవుట్‌లెట్‌పైనా కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోలియం శాఖ హెచ్చరించింది. ఇంధన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది.

ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ20 పెట్రోల్ సరఫరా ప్రక్రియకు సంబంధించిన వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది. వాహనాల ట్యాంకుల్లోకి ఇంధనం చేరడానికి చాలా ముందే నాణ్యత పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇథనాల్ కొనుగోలు నుంచి పెట్రోల్ బంకులకు ఈ20 ఇంధనం చేరే వరకు ప్రతి దశలోనూ కఠినమైన తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది.

ఈ20 పెట్రోల్ తయారీకి అవసరమైన ముడి ఇథనాల్ కొనుగోలుతో నాణ్యత నియంత్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి ఇథనాల్ బ్యాచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్దేశించిన ఐఎస్ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం తెలిపింది. ఇథనాల్‌లో కనీసం 99.6 శాతం స్వచ్ఛత ఉండటం తప్పనిసరి అని పేర్కొంది.

డిస్టిలరీ నుంచి ఓఎంసీ డిపోకు పంపే ప్రతి ఇథనాల్ సరుకుతో పాటు నాణ్యత ధ్రువీకరణ నివేదికను కూడా పంపిస్తారు. నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇథనాల్ ఉందని నిర్ధారించిన తర్వాతే దానిని స్వీకరిస్తామని పెట్రోలియం శాఖ వెల్లడించింది.

రాజీ లేదు

ఇంధన నాణ్యత పరీక్షలు కేవలం నామమాత్రంగా జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. జూలై 2024 నుంచి జూన్ 2026 వరకు నాణ్యత ప్రమాణాలను పాటించని 302 ట్యాంకర్ ట్రక్కులను తిరస్కరించినట్లు తెలిపింది. ఈ ట్యాంకర్లలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ ఉన్నట్లు వెల్లడించింది. ఇథనాల్ స్వచ్ఛత, నీటి శాతం, సాంద్రత వంటి ప్రమాణాల్లో లోపాలు గుర్తించడంతో ఈ ట్యాంకర్లను తిరస్కరించినట్లు పేర్కొంది. నాణ్యత లేని ఇంధనం ప్రజలకు చేరకముందే సరఫరా వ్యవస్థ నుంచి తొలగించేలా కఠినమైన వడపోత ప్రక్రియ అమలులో ఉందని వివరించింది.

నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత ఇథనాల్‌ను ప్రత్యేక నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. ఇతర ఇంధనాలు లేదా పదార్థాలతో కలుషితం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని కేంద్రం తెలిపింది. డిపోలో ట్యాంకర్‌ను స్వీకరించే ముందు.. ట్యాంకర్ పైభాగం, దిగువ భాగం నుంచి ఇంధన నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీంతో మొత్తం ఇథనాల్ బ్యాచ్‌లో నాణ్యత ఒకే విధంగా ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలిపి ఈ20 ఇంధనంగా మార్చిన తర్వాత కూడా నాణ్యత పరీక్షలు కొనసాగుతాయని పెట్రోలియం శాఖ వెల్లడించింది. తుది ఈ20 పెట్రోల్‌ను రిటైల్ అవుట్‌లెట్లకు పంపే వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది.

ఇథనాల్ కొనుగోలు నుంచి డిపోల్లో నిల్వ, ఈ20 పెట్రోల్ తయారీ, పెట్రోల్ బంకులకు సరఫరా వరకు బహుళస్థాయి నాణ్యత నియంత్రణ వ్యవస్థ అమలులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంధన కలుషితంపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నిరంతర పరీక్షలు నిర్వహిస్తున్నామని, నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోలియం శాఖ వెల్లడించింది.