Dharmendra Pradhan: మంత్రి పదవి వీడినా ధైర్యం వీడలేదు.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వైరల్

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తొలిసారిగా పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ఎంపీలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాజీనామా చేసినప్పటికీ ఆయన ముఖంలో ఎలాంటి నిరాశ కనిపించకుండా చిరునవ్వుతో అందరినీ పలకరించారు. పార్లమెంట్ కారిడార్లలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. “ఇలా జరుగుతూ ఉంటుంది” అని ఆయన చెప్పగా, వెంటనే స్పందించిన ప్రధాన్ “ఏమీ జరగలేదు” అని సమాధానం ఇచ్చారు. అనంతరం “నేను వీధి యోధుడిని.. ఏసీ గది కార్యకర్తను కాదు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు వచ్చిన సందర్భంగా ఎన్డీఏ ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఒక ఎంపీ మాట్లాడుతూ, “ఎలాంటి వ్యక్తిగత అభియోగాలు లేకుండానే ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి” అని వ్యాఖ్యానించారు. ప్రధాన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ బాధ్యతకు నిదర్శనమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్ రాజకీయ పాత్రపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒడిశా బీజేపీలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన, జాతీయ స్థాయిలో కూడా పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలకు దోహదపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ప్రస్తావనీయమే.

రాజీనామా అనంతరం కూడా పార్టీ ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ధర్మేంద్ర ప్రధాన్ చేపట్టిన విద్యా సంస్కరణలను ప్రశంసించారు. ఆయన రాజీనామా విశ్వసనీయత కోల్పోయిన సంకేతం కాదని, రాజకీయ జవాబుదారీతనం మరియు త్యాగానికి నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ మరోసారి ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.