Delhi: జంతర్‌మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!

  • జంతర్‌మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్
  • న్యాయం కోసం పోరాటం చేసేందుకు ఏర్పాట్లు
  • ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ
Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర మరో ధర్నా జరిగేటట్లు కనిపిస్తోంది. ఈసారి విద్యార్థులు కాకుండా.. ఖాకీలు ధర్నా చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. పోలీసులే న్యాయం కోసం పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నారు.

జూలై 20న ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని ‘చలో పార్లమెంట్’ ఆందోళన సందర్భంగా గాయపడిన పోలీసు సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఢిల్లీ పోలీసు అధికారులు, సిబ్బంది నిరసనకు సిద్ధమయ్యారు. రిటైర్డ్ గెజిటెడ్, నాన్-గెజిటెడ్ పోలీసు సిబ్బంది సంఘమైన ఢిల్లీ పోలీస్ మహాసంఘ్ జూలై 31న జంతర్‌మంతర్ దగ్గర శాంతియుత ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాసింది.

సంఘం ప్రతిపాదన ప్రకారం జూలై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు ధర్నా చేపట్టనుంది. జూలై 20న సీజేపీ నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ, వారికి సంఘీభావం తెలపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం… ఆందోళనలో సంఘవిద్రోహ శక్తులు చొరబడి భద్రతా బలగాలపై దాడి చేయడంతో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారు. జంతర్‌మంతర్ సమీపంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అనంతరం పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. అయితే నిరసనకారులు పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తుండగా, ఢిల్లీ పోలీసులు మాత్రం చట్టవ్యవస్థను కాపాడే క్రమంలో తమ సిబ్బందిపైనే దాడులు జరిగాయని చెబుతున్నారు.

ఢిల్లీ పోలీస్ మహాసంఘ్ దాఖలు చేసిన దరఖాస్తులో జంతర్‌మంతర్ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు, పారామిలిటరీ సిబ్బంది గాయపడిన విషయాన్ని ప్రస్తావించింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తింపు ఇవ్వడం, వారికి మద్దతు ప్రకటించడమే ఈ ధర్నా ఉద్దేశమని పేర్కొంది.

జూలై 27న ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని జనరల్ డైరీ (GD) విభాగానికి ఈ లేఖ చేరినట్లు సమాచారం. మాజీ ఢిల్లీ పోలీసు సిబ్బంది, చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంఘం తెలిపింది. భారీ ఆందోళనల సమయంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు సిబ్బంది ఎదుర్కొనే ప్రమాదాలపై ప్రజల దృష్టిని ఆకర్షించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ధర్నా పూర్తిగా శాంతియుతంగా, ఎలాంటి హింసకు తావులేకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా జూలై 20న జరిగిన ఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ఆందోళనలను ఎదుర్కొనే విషయంలో కొత్త ప్రోటోకాల్ అవసరమని, ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల నిరసన సందర్భంగా సరిగా అమలు చేయలేదని అభిప్రాయపడింది. పరీక్షల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో జరిగిన నిరసనల్లో పోలీసుల చర్యలపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే అని స్పష్టం చేసింది. ‘‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారైనా, అతిగా బలప్రయోగం చేసినవారైనా వారిపై చర్యలు తప్పనిసరిగా ఉండాలి. బాధ్యులను గుర్తించకుండా జరిగే దర్యాప్తుకు అర్థం ఉండదు.’’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.