Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు

Parliament March

Parliament March

Parliament March: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.. కీల బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.. అయితే సమావేశాల తొలి రోజు ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వైపు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సోమవారం ఐదు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని డీఎంఆర్‌సీ వెల్లడించింది.

డీఎంఆర్‌సీ మూసివేసిన స్టేషన్లలో రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయగా, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ప్రయాణించే వారు తాజా డీఎంఆర్‌సీ సమాచారం తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాక్రోచ్‌ జనతా పార్టీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున విద్యా రంగ సంస్కరణలను డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నిరసనకు తొలుత సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పిలుపునిచ్చినప్పటికీ, ఆయన శనివారం ఆస్పత్రిలో చేరిన తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు ఇతర కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద కూడా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ర్యాలీకి అనుమతి కోరలేదని, ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో అమల్లో ఉన్న సీఆర్పీసీ సెక్షన్ 144కు సమానమైన ఈ నిబంధనల ప్రకారం నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, ఐదుగురికి మించిన గుంపులుగా సమావేశాలు నిషేధించబడ్డాయి. జంతర్ మంతర్‌లో మాత్రమే ముందస్తు అనుమతితో నిరసనలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఆంక్షలు అవసరమని పేర్కొన్నారు.

పార్లమెంట్ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించి నిరసన ర్యాలీలు లేదా నిషేధిత ప్రాంతాల్లో గుమికూడే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఇక, మెట్రో స్టేషన్ల మూసివేతతో పాటు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండే అవకాశం ఉన్నందున, సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి, డీఎంఆర్‌సీ మరియు ట్రాఫిక్ పోలీసుల తాజా సూచనలను అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.