దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. రేపు (శనివారం) ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలకు ముందే అభ్యర్థుల కొనుగోలు ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆప్ అభ్యర్థులను రూ.15 కోట్లకు కొనుగోలుకు బీజేపీ తెరలేపిందని.. కేజ్రీవాల్, సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు. సంజయ్ సింగ్ ప్రెస్మీట్ పెట్టి చెప్పగా.. కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఆరోపించారు. అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని ఆశ జూపిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఏసీబీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆప్ పేర్కొంది. ఈ కొనుగోలు వ్యవహారం తాజాగా పెను దుమారం రేపుతోంది. ఆప్ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా విచారణకు ఆదేశించారు. విచారణ జరపాలని ఏసీబీ అధికారులకు ఎల్జీ ఆదేశించారు.
ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనని బీజేపీ ధ్వజమెత్తింది.
16 మంది ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయని.. పార్టీ ఫిరాయిస్తే మంత్రి పదవులు.. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఎక్స్ ట్విట్టర్లో కేజ్రీవాల్ ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వేలు చేయిస్తుందని.. అందుకే బీజేపీ గెలుస్తుందంటూ లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిజంగా బీజేపీ గెలిస్తే.. ఆప్ అభ్యర్థులకు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. కుట్రలో భాగంగా ఫేక్ సర్వేలు చేయిపించి.. ఆప్ను విచ్ఛన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.