Site icon NTV Telugu

Delhi: లక్ష్మీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం

Delhifire

Delhifire

దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నివాస ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలో ఉన్న నాలుగు భవనాలు దగ్ధమై.. 14 ఫ్లాట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేశారు.

తెల్లవారుజామున 12:45 గంటల ప్రాంతంలో తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జె ఎక్స్‌టెన్షన్‌లోని రమేష్ పార్క్ నివాస ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి.. నిప్పురవ్వలు సమీపంలోని భవనాలకు వ్యాపించాయి. మంటలు వేగంగా నాలుగు నివాస భవనాలను చుట్టుముట్టాయి. దీంతో 14 అపార్ట్‌మెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ వచ్చి మంటలను అదుపు చేశారు.

అగ్నిమాపక శాఖ సహాయ డివిజనల్ అధికారి రాజేష్ కుమార్ శుక్లా మాట్లాడుతూ.. తెల్లవారుజామున 12:45 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే మొత్తం ఎనిమిది అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని.. ఎంతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. అగ్నిప్రమాదానికి గల కారణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.. పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.

 

Exit mobile version