Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు

  • జంతర్‌మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరింపు
  • ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
  • ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని వార్తలు
Delhipolice

Delhipolice

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం చలో పార్లమెంట్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ నిర్వహించారు. దీంతో చాలా మంది బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా కూడా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులకు మద్దతు లభించింది. సినీ, క్రికెటర్లు, విపక్ష రాజకీయ నాయకుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.

ఇక తాజాగా జంతర్‌మంతర్ దగ్గర కిలోమీటర్ దూరంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ రాత్రికి ఏదైనా జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. నిరసనకారులను తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు బలగాలు మోహరించాయి.

మరోవైపు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా గాంధీ స్మృతి వనం దగ్గర నివాళులర్పించారు. విద్యార్థులకు ఇండియా కూటమి అండగా ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. మరోవైపు సీజేపీని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే తటస్థంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయాలని విద్యార్థులు సూచిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.