ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
అయినా అసలు ఇదేం పిటిషన్ అంటూ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తుందా అంటూ పిటిషన్దారుడిని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే కనీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయినా చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. దీనిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి కోర్టు ఎక్కడ జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ పిల్ను కొట్టి పారేస్తామని ఆయన ప్రకటించడంతో పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు.
