పెర్నోడ్ రికార్డ్ కు ఢిల్లీలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ వంటి ప్రముఖ మద్యం బ్రాండ్ల విక్రయాలకు అనుమతి ఇవ్వాలంటూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో 2023 నుంచి కొనసాగుతున్న ఆ కంపెనీపై ఢిల్లీ మార్కెట్ నిషేధం యథాతథంగా కొనసాగనుంది. 2021 ఢిల్లీ మద్యం విధాన కేసులో కంపెనీ పేరు రావడంతో ఈ వివాదం మొదలైంది.
ఈడీ ఆరోపణలు.. రిటైలర్లతో కుమ్మక్కు కేసు
2021లో తమ మార్కెట్ వాటాను అక్రమంగా పెంచుకునేందుకు రిటైలర్లతో కుమ్మక్కయ్యిందని Enforcement Directorate (ED) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పెర్నోడ్ రికార్డ్ మద్యం లైసెన్స్ దరఖాస్తును ఢిల్లీ అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న సంస్థను తిరిగి వ్యాపారం చేసేందుకు అనుమతించాలా వద్దా అన్నదే ప్రధాన వివాదంగా మారింది. అయితే, హైకోర్టు తీర్పుపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
రూ.3,000 కోట్ల పన్ను బకాయిల ఆరోపణ
మద్యం విధాన వివాదంతో పాటు, పెర్నోడ్ రికార్డ్ భారత పన్ను అధికారులతో మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం, కంపెనీ తన స్కాచ్ విస్కీ దిగుమతుల అసలు విలువ, వయస్సు, కూర్పు వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువను తక్కువగా చూపించడం ద్వారా కస్టమ్స్ సుంకాలు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీపై సుమారు రూ.2,996 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.
కోడ్ పేర్లతో కస్టమ్స్ అధికారులను తప్పుదారి పట్టించారా?
దర్యాప్తు సంస్థల ప్రకారం, కంపెనీ తన దిగుమతి చేసుకున్న మాల్ట్లకు కొత్త కోడ్ పేర్లు ఉపయోగించిందని తెలుస్తోంది. దీని వల్ల కస్టమ్స్ అధికారులు అసలు ఉత్పత్తులను గుర్తించడం కష్టమైందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, దిగుమతి చేసిన స్కాచ్ కాన్సంట్రేట్ అసలు కూర్పు, వయస్సు వంటి వివరాలను కూడా కంపెనీ పూర్తిగా వెల్లడించలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను పెర్నోడ్ ఇండియా పూర్తిగా ఖండించింది. తాము అన్ని చట్టపరమైన నిబంధనలను పాటించామని, న్యాయపరంగా పోరాడుతున్నామని సంస్థ స్పష్టం చేసింది.
67% తక్కువగా చూపిన దిగుమతి విలువ?
దర్యాప్తు నివేదికల ప్రకారం, కంపెనీ తన స్కాచ్ కాన్సంట్రేట్ దిగుమతుల విలువను సుమారు 67.49% వరకు తక్కువగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారతదేశంలో అమల్లో ఉన్న 150% కస్టమ్స్ సుంకం నుంచి భారీగా లాభపడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. Royal Stag వంటి ప్రముఖ విస్కీ బ్రాండ్లు ఈ దిగుమతి చేసిన స్కాచ్ కాన్సంట్రేట్ను నీరు, కారామెల్ వంటి పదార్థాలతో కలిపి తయారు చేస్తారని తెలుస్తోంది.
కేసులో ఓడితే రూ.5,700 కోట్లకుపైగా భారం
భారతదేశం పెర్నోడ్ రికార్డ్కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ వివాదానికి ముందు కంపెనీ భారత అమ్మకాలలో దాదాపు 5% వాటా ఒక్క ఢిల్లీ నుంచే వచ్చేది. ప్రస్తుతం కంపెనీపై సుమారు రూ.3,000 కోట్ల ట్యాక్స్ లయబిలిటీ ఉన్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే, ఈ కేసులో కంపెనీ ఓడిపోతే జరిమానాలతో కలిపి మొత్తం భారం రూ.5,725 కోట్లకు మించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
విస్కీ తయారీ ఎలా జరుగుతుంది?
పెర్నోడ్ రికార్డ్ వంటి కంపెనీలు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో స్కాచ్ కాన్సంట్రేట్ను దిగుమతి చేసుకుంటాయి. ఈ కాన్సంట్రేట్ను నీరు, న్యూట్రల్ స్పిరిట్స్, కారామెల్ వంటి పదార్థాలతో కలిపి విస్కీ బ్రాండ్లను తయారు చేస్తారు. ఈ స్కాచ్ కాన్సంట్రేట్ దిగుమతులపై భారతదేశంలో 150% వరకు భారీ కస్టమ్స్ సుంకం విధిస్తారు.
