CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్

  • ఢిల్లీ భవన ప్రమాదం
  • డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది MCD అధికారులు సస్పెండ్
Delhi Building Collapse 7 D

Delhi Building Collapse 7 D

CM Rekha Gupta: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన భవన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటూ MCDకి చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 7 మంది మృతి చెందగా, 12 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా అనే ఆందోళన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఐదుగురు MCD అధికారులపై వేటు

రాకేశ్ కుమార్ – డిప్యూటీ కమిషనర్, సౌత్ జోన్
రణ్‌వీర్ సింగ్ – సూపరింటెండింగ్ ఇంజినీర్, సౌత్ జోన్
లలిత్ కుమార్ గోయల్ – ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సౌత్ జోన్
సునీల్ చౌహాన్ – అసిస్టెంట్ ఇంజినీర్, సౌత్ జోన్
ఆశిష్ కుమార్ – జూనియర్ ఇంజినీర్
భవన నిర్మాణం, నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి అధికారుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

వరుసగా రెండో రోజు ఘటనాస్థలికి సీఎం

ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం వరుసగా రెండో రోజు సత్య నికేతన్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక, రక్షణ చర్యలను పరిశీలించారు. మృతులు, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.

‘పాత భవనం.. బేస్‌మెంట్‌లో నీరు చేరడంతో పిల్లర్లు కూలిపోయాయి’

ఘటనపై స్పందించిన సీఎం రేఖా గుప్తా.. భవనం చాలా పాతదని తెలిపారు. బేస్‌మెంట్‌లో నీరు చేరడం వల్ల భవనంలోని పిల్లర్లు దెబ్బతిని చివరకు మొత్తం భవనం కూలిపోయినట్లు వివరించారు. భవన యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

భవన యజమానిపై లుక్‌అవుట్ నోటీసు

ఇదిలా ఉండగా, భవనం యజమాని హరి రామ్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ప్రమాదం అనంతరం యజమాని ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. భవనం కూలే సమయంలో అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ భవనంలో మెన్స్ పేయింగ్ గెస్ట్ (PG) వసతి నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో మరమ్మతు పనులు జరుగుతుండగా ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భవనంలో ఉన్న పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ఫైర్ సర్వీస్, NDRF, DDMA బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భారీగా పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలింపు చేపట్టాయి.

మృతుల సంఖ్య 7కు చేరింది

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 7 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 12 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. NDRF అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శిథిలాల్లో చిక్కుకున్న వారి ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు. అవసరమైతే రాత్రి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉంది.