Supreme Court: రెండు దశాబ్ధాల క్రితం చోటు చేసుకున్న హత్యలో నిందితుడికి యావజ్జీవ శిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ అయిన భర్త తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. బాధితుడు తనను చంపేందుకు వచ్చాడని, ఆత్మరక్షణ కోసమే తాను చంపాల్సి వచ్చిందని, దీనిని హత్యగా చెప్పలేమని నిందితుడు సురేందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సుధాన్షు ధులియా, రాజేష్ బిందాల్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
Read Also: Hathras Stampede: పక్కటెముకలు విరగడం, ఊపిరాడకపోవడంతో మరణాలు..
మరణించిన వ్యక్తిపై గాయాలు, తుపాకీ కాల్పులు ఇవన్నీ హత్య అనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని, చివరకు నిందితుడు తాను అనుకున్నది సాధించాడని, ఇది తక్కువ పరిమాణం ఉన్న కేసు కదాని న్యాయమూర్తి ధులియా 23 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అతడి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రస్తుత కేసు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణ హత్య అనే వాస్తవాలను వెల్లడిస్తాయని చెప్పింది. నిందితుడు నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని తీర్పు చెప్పింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. చనిపోయిన వ్యక్తి, దోషి సమీప బంధువును పెళ్లి చేసుకున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. బాధితుడు, ఆ సమయంలో కానిస్టేబుల్గా ఉన్న సురేందర్ సింగ్ భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. జూన్ 30, 2002న మయూర్ విహార్ పోలీస్ స్టేషన్లో బాధితుడు వెళ్లిన సందర్భంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర పోలీస్ సిబ్బంది చూస్తుండగానే, దోషి తన అధికారిక 9-ఎంఎం కార్బైన్తో బాధితుడిని చంపేశాడు.