సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. సుమారు 6 గంటలపాటు నేతల మధ్య సమాలోచనలు సాగాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో చర్చలు, సమాలోచనలు పూర్తవుతాయని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు, సంస్థాగతంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రజల ఆశలకు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు, రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రగతిశీల, శక్తివంతమైన “భారత్” దేశాన్ని ఆవిష్కరించుకునేందుకు అనుసరించాల్సిన విధానాల పై చర్చలు జరుగుతున్నాయి. సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని అంశాలు, అందరి అభిప్రాయాలను పరిశీలిస్తుంది.
