NTV Telugu Site icon

Haryana: హర్యానాలో ఆప్-కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత.. కారణమిదేనా?

Congressapp

Congressapp

త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయితీ తెగకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మీమాంసం నెలకొంది.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆప్ 20 సీట్లు ఆశిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో పొత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆప్‌కి 20 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆప్ పోటీ చేసే స్థానాల జాబితాను ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితా అందాక తదుపరి నిర్ణయం ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే హర్యానాలో పొత్తుకు రాహుల్ గాంధీ సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆప్ నేతలు అంటున్నారు. అయితే 20 సీట్లు కాకుండా.. కొన్ని సీట్లు తగ్గించి ఇచ్చేలా ఆప్ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. తొలుత అక్టోబర్ 1నే ఓటింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. అయితే అక్కడ జరగనున్న ఫెస్టివల్ సందర్భంగా పోలింగ్ తేదీ మారింది. జమ్మూకాశ్మీర్‌లో మాత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం హర్యానాతో పాటు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.