Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

Coimbatore Girl Murder Case

Coimbatore Girl Murder Case

Coimbatore R*ape Case: తమిళనాడులో సంచలనం రేపిన కోయంబత్తూరు చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదనే ఆరోపణలు రోజురోజుకూ మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విజయ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చిన్నారి హత్య ఘటనపై స్పందించిన అధికారుల తీరే ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.

ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ మాట్లాడిన అధికారులపై విమర్శలు
ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన ఓ మహిళా పోలీస్ అధికారి నవ్వుతూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత దారుణ ఘటన జరిగిన సమయంలో బాధ్యతాయుతంగా స్పందించకుండా నవ్వుతూ మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళా మంత్రులు కీర్తన, జగధీశ్వరీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా చిరునవ్వులతో కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లో పడింది.

బాధితురాలి తల్లి సంచలన ఆరోపణలు
ఈ ఘటనపై తాజాగా బాధితురాలి తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె మృతదేహాన్ని చివరిసారి కూడా చూడనీయలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోస్ట్‌మార్టం అనంతరం తనకు తెలియకుండా మృతదేహాన్ని అంబులెన్స్‌లో వెనుక ద్వారం గుండా తరలించారని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే దహనం చేశారని ఆమె ఆరోపించింది. తన బిడ్డను చివరిసారి చూసే అవకాశం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది. ఈ ఆరోపణలు బయటకు రావడంతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళనాడులో రాజకీయ దుమారం
కోయంబత్తూరు ఘటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.. ప్రభుత్వ వైఖరి, పోలీసుల ప్రవర్తన, బాధిత కుటుంబానికి అందిన న్యాయం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.