NTV Telugu Site icon

Vande bharat train: వందే భారత్ రైల్లో కలుషిత ఆహారం.. పప్పులో బొద్దింక ప్రత్యక్షం

Vandebharat Train

Vandebharat Train

రైల్వే వ్యవస్థను ఆధునీకరించాం అంటూ కేంద్ర ప్రభుత్వం ఉపన్యాసాలతో ఊదరగొడుతోంది. రైలు కోచ్‌లను సుందరీకరించాం.. మెరుగైన వసతులు కల్పిస్తున్నామని రైల్వేశాఖ గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అవన్నీ మాటలకే పరిమితం అని అర్ధమవుతున్నాయి. భారతీయ రైల్వేలో వందే భారత్ రైళ్లను మోడీ సర్కార్ ప్రవేశపెట్టింది. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుస్తాయని.. అలాగే మెరుగైన వసతులు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా సాధారణ ఎక్స్‌ప్రెస్‌ ధరల కంటే ఎక్కువగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కానీ వాస్తవ రూపంలోకి వస్తే మాత్రం అవన్నీ వట్టివేనని నిరూపితం అవుతున్నాయి.

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త రిక్కీ జెస్వానీ సోమవారం రాత్రి తన కుటుంబంతో కలిసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో షిర్డీ నుంచి తిరిగి ముంబై నగరానికి వస్తున్నాడు. అయితే అతడు ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. తీరా పార్శిల్ ఓపెన్ చేసి తినేందుకు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా పప్పులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు షాక్‌కు అయ్యారు. వెంటనే ఫిర్యాదు చేయడానికి ప్యాంట్రీ కారు దగ్గర వెళ్లి చూడగా అక్కడ మరింత షాకింగ్ సీన్లు కనిపించాయి. డస్ట్‌బిన్ పక్కనే ఆహారం తయారు చేయడం చూసి అవాక్కయ్యారు. వంట చేసే దగ్గరే బొద్దింకలు తిరగడం చూసి ఖంగుతున్నారు.

ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ అధికారులకు సోషల్ మీడియా ద్వారా రిక్కీ జెస్వానీ (48) ఫిర్యాదు చేశాడు. డస్ట్‌బిన్ దగ్గరే వంట తయారు చేస్తున్నారని కంప్లంట్ ఇచ్చారు. ఏసీ చైర్ కార్ కోచ్‌లో ఇదేం ఫుడ్ అంటూ దుయ్యబట్టారు. పెరుగు కూడా ఫుల్లగా ఉందని.. చెడిపోయిన పెరుగు ఇచ్చారంటూ వాపోయారు. ఇక 80 ఏళ్ల తాతయ్య ఇలాంటి ఫుడ్ తినగలరా? అంటూ జెస్వానీ కుమారుడు ఆర్యన్ మండిపడ్డాడు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ స్పందించి బాధితులకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.