అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే జుబీన్ గార్గ్ మేనేజర్, ఉత్సవ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్ప్రవను అరెస్ట్ చేశారు. దీంతో జుబీన్ గార్గ్ మృతి కేసులో అరెస్ట్ల సంఖ్య 4కి చేరింది.
బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్ప్రవ.. జుబీన్గార్గ్ ఈత కొట్టే సమయంలో ఆయనకు చాలా దగ్గరగానే ఉన్నట్లు వీడియోలో పోలీసులు గుర్తించారు. ఇక గోస్వామి అయితే.. జుబీన్ గార్గ్కు చాలా దగ్గరగా ఈత కొట్టడం వీడియోలో కనిపించింది.
జుబీన్ గార్గ్, గోస్వామి పక్కపక్కనే ఈత కొడుతున్న సమయంలో ఆ దృశ్యాలను కో సింగర్ అమృత్ప్రవ తన మొబైల్లో షూట్ చేసింది. దీంతో ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని ఆరు రోజులుగా విచారిస్తున్నారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు గోస్వామిని, అమృత్ప్రవను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇద్దరిని 14 రోజుల సీఐడీ కస్టడీకి పంపింది. ఇప్పటికే మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ్ నిర్వాహకుడు శ్యామ్కాను మహంతలను అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని ఒకే చోట కూర్చోబెట్టి దర్యాప్తు సంస్థ విచారించనుంది.
ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని.. దర్యాప్తు వివరాలు మీడియాతో పంచుకోలేమని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (హత్య) కింద అభియోగాలు మోపినట్లు సీఐడీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మున్నా గుప్తా అన్నారు. సింగపూర్ కూడా వెళ్లి అక్కడ ఆధారాలు సేకరిస్తామని చెప్పారు. అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
జుబీన్ గార్గ్ (52) సింగపూర్లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్మార్టంలో మునిగి చనిపోయినట్లు వెల్లడైంది. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Udit Raj: ఆర్ఎస్ఎస్ ఉగ్ర సంస్థ.. మోడీ ఆధునిక రావణుడు.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
ఇక జుబీన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా.. బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారని గరిమా గార్గ్ ఆరోపించారు. సింగపూర్ తీసుకెళ్లాక జుబీన్ గార్గ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు గుండె జబ్బు ఏమీలేదని చెప్పారు. జుబీన్ గార్గ్ ప్రయాణంలో అలసిపోయారని.. అంతేకాకుండా మందులు వాడుతున్నారని చెప్పుకొచ్చారు. మందులు వాడుతున్న వ్యక్తిని ఎందుకు పిక్నిక్, ఈతకు ఎందుకు తీసుకెళ్లారని ఈవెంట్ నిర్వాహకులను గరిమా గార్గ్ నిలదీశారు. జుబీన్ గార్గ్ మేనేజర్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేదని ప్రశ్నించారు. జుబీన్ గార్గ్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని స్పష్టం చేశారు. అస్సాం సాంస్కృతిక చిహ్నాన్ని మనం కోల్పోయినట్లు ఆవేదనను గరిమా గార్గ్ వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో దారుణం.. 12 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి ఏం చేసిందంటే..!
జుబీన్ గార్గ్ చనిపోక ముందు ఫోన్లో మాట్లాడానని.. ఒక్కసారి కూడా పిక్నిక్ అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అంటే పిక్నిక్ అంశం జుబీన్ గార్గ్ కూడా తెలియకపోవచ్చని పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ పగటి పూటే నిద్రపోతారని.. అలాంటిది బలవంతంగా తీసుకెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ మందులు వాడుతుంటారు. అలాంటిది మందులు ఇచ్చారో లేదో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు.
ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన సిద్ధార్థ్కు ఫోన్ చేశానని.. ఈతకు వెళ్లినప్పుడు నీటిలోపల మూర్ఛ వచ్చిందని చెప్పాడని పేర్కొంది. జుబీన్ గార్గ్కు ఎప్పుడూ గుండె పోటు వచ్చిన దాఖలాలు ఏమీ లేవన్నారు. ఆనాటి సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇవ్వాలని నిర్వాహకులను అడిగానని.. కానీ ఇప్పటి వరకు మాత్రం అందించలేదని చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ మరణం వెనుక చాలా కారణాలు ఉండొచ్చని.. ఇది స్కూబా డ్రైవింగ్ వల్ల జరిగిన మరణం కాదని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమె కోరింది.
న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని గరిమా గార్గ్ చెప్పుకొచ్చారు. మనకు అతి త్వరలో న్యాయం జరుగుతుందని… దీన్ని కచ్చితంగా తాను నమ్ముతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ ఎప్పుడు అస్సాం ప్రజల గురించే ఆలోచించేవాడని.. ప్రకృతే ఆయనకు దేవుడు అని గరిమా గార్గ్ పేర్కొన్నారు.
