CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్

  • అవినీతిపై సీఎం విజయ్ సీరియస్
  • మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కూ నో!
Cmvijay

Cmvijay

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అవినీతి ఏ స్థాయిలో జరిగినా కఠిన చర్యలు తప్పవని మంత్రివర్గానికి హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు.. ప్రజా కార్యక్రమాల పేరుతో ముఖ్యంగా పాఠశాలల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించారు.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్ మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా సేవ కంటే సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వొద్దని, ముఖ్యంగా పాఠశాలల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ప్రచార వీడియోలు తీయకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఖర్చుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అవినీతిని సహించబోమని మరోసారి స్పష్టం చేశారు.

విజయ్ ప్రభుత్వం అవినీతిపై చేపట్టిన చర్యల్లో భాగంగా ఇటీవల గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు చెందిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. నకిలీ బిల్లులు సృష్టించడం, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, లంచాలు తీసుకోవడం వంటి ఆరోపణలు వారిపై నమోదయ్యాయి. సస్పెండ్ అయిన వారిలో జోనల్ హెల్త్ ఆఫీసర్, సీనియర్ ఎంటమాలజిస్ట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్ వర్కర్, క్లర్క్ తదితరులు ఉన్నారు. ఈ అధికారులపై ప్రాథమిక ఆధారాలు లభించాయని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ తెలిపారు. ప్రస్తుతం అంతర్గత విచారణ కొనసాగుతోందని.. ఆరోపణలు రుజువైతే వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వెల్లడించారు.

టీవీకే నేతపై కూడా వేటు

అవినీతి ఆరోపణలు అధికారులకే పరిమితం కాలేదు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ కూడా అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీకి చెందిన చెంగల్పట్టు తూర్పు జిల్లా సంయుక్త కార్యదర్శి వీరా వీరసామిని రూ.1.3 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించింది. పార్టీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందున వీరా వీరసామిని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. వీరా వీరసామి నగదు స్వీకరిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. తనకు వీడియోలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి 25 రోజుల క్రితం తన దగ్గర నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.., ఇప్పుడు అదే డబ్బును తిరిగి ఇచ్చాడని వీరసామి వివరణ ఇచ్చారు. తనను, ముఖ్యమంత్రి విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.