CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం

  • రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి
  • రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
  • కాంగ్రెస్‌పై బీజేపీ ఎటాక్
Cmvijay

Cmvijay

మరో రెండు రోజుల్లో దివంగత మాజీ భారత ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి రాబోతుంది. ఇలాంటి తరుణంలో సీఎం విజయ్ వ్యవహరశైలి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ మద్దతుతో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. అలాంటిది రాజీవ్‌గాంధీ హంతకుడు, మాజీ ఎల్‌టిటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు విజయ్ నివాళులర్పించడం రాజకీయం సంచలనంగా మారింది.

1991, మే 21న శ్రీపెరంబుదూరు బాంబ్ పేలుడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అప్పటి ఎల్‌టిటీఈ చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్‌ హత్యకు కుట్రపన్నినట్లుగా తేలింది. అలాంటిది కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన టీవీకే ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ తీవ్ర విమర్శల దాడి చేసింది.

ఎల్‌టిటీఈ సంస్థ.. రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ‘‘రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యులైన ఎల్‌టిటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు తమిళనాడు కొత్త సీఎం విజయ్ నివాళులర్పించారు. కాంగ్రెస్‌కు అధికారంలో భాగం దక్కితే చాలు.. ఇలాంటి విషయాలపై ఎలాంటి అభ్యంతరం ఉండదేమో’’ అంటూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.

ఇటీవల శ్రీలంకలోని ముల్లైవైక్కాల్ ఘటన వార్షిక దినం సందర్భంగా విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ముల్లైవైక్కాల్ జ్ఞాపకాలను మన హృదయాల్లో మోస్తాం. సముద్రం ఆవల నివసిస్తున్న తమిళుల హక్కుల కోసం ఎప్పుడూ సంఘీభావంగా నిలుస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.

అయితే విజయ్ వ్యాఖ్యలను టీవీకే పార్టీ సమర్థించింది. ముల్లైవైక్కాల్ అంటే కేవలం ప్రభాకరన్ మరణం మాత్రమే కాదని.. శ్రీలంక అంతర్యుద్ధంలో వేలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు గుర్తుగా చెప్పారని పార్టీ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమాయక తమిళుల మరణాలను గుర్తు చేసుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నాయి.

2009 మే 18న శ్రీలంక సైన్యం ముల్లైవైక్కాల్‌లో ప్రభాకరన్‌ను హతమార్చింది. అదే సమయంలో వేలాది మంది తమిళ పౌరులు కూడా మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీలంక తమిళులు ప్రతి సంవత్సరం మే 18ను “ముల్లైవైక్కాల్ రిమెంబరెన్స్ డే”గా నిర్వహిస్తుంటారు.

ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా విజయ్ ఈలాం తమిళుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘తమకు తల్లిలా అండగా నిలిచిన నాయకుడిని కోల్పోయిన ఈలాం తమిళులు ఇంకా బాధపడుతున్నారు. వారి కోసం మనం గొంతెత్తాల్సిన బాధ్యత ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీలు సాధారణంగా ప్రభాకరన్‌కు బహిరంగ మద్దతు తెలపడం అరుదు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో విజయ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.