తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీ సయానీ ఘోష్ కలిశారు. చెన్నై సచివాలయంలో విజయ్ను కలిసి రాష్ట్ర సుపరిపాలనను, దార్శనికతను ప్రశంసించారు. అనంతరం విజయ్తో సయానీ ఘోష్ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం సయోని ఘోష్ మాట్లాడుతూ.. విజయ్ పశ్చిమ బెంగాల్ గురించి ఆప్యాయంగా మాట్లాడారని.. గొప్ప సంస్కృతి, సంప్రదాయాల పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేశారని తెలిపారు. సయానీ ఘోష్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తలపతి విజయ్ సినిమాలోని ఒక పాటతో పాటు ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ‘‘ఆయన ఆత్మీయ ఆతిథ్యానికి నేను కృతజ్ఞురాలిని. తన రాష్ట్రం కోసం తన దార్శనికతను నెరవేర్చుకునే దిశగా ఆయన చేస్తున్న కృషికి నా శుభాకాంక్షలు.’’ అని రాశారు.
సమావేశం సందర్భంగా సయానీ ఘోష్ ముఖ్యమంత్రి విజయ్తో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఘోష్.. సీఎం విజయ్తో సమావేశానికి సంబంధించిన ఫొటోలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఒక ఫొటోలో విజయ్కి ఏదో ఇస్తూ కనిపించారు. అయితే విజయ్ను ఎందుకు కలిశారో సాయోని వెల్లడించలేదు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను వీడి.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన సయానీ ఘోష్కు.. ముఖ్యమంత్రి విజయ్కు మధ్య జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల మధ్య ఒక కొత్త సంభాషణకు సంకేతంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు నాయకులు తమ తమ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయాలుగా ఎదిగారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. విజయ్ తమిళ, దక్షిణాది చిత్రసీమలో సూపర్స్టార్ కాగా.. సయానీ ఘోష్ బెంగాలీ చిత్రాల్లో పనిచేశారు.

