CM Vijay: మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ

  • మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ
  • కరూర్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడంపై అభ్యంతరం
  • విజయ్ ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు
Karur Stampede

Karur Stampede

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు రద్దు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసు దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో 2025 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నుంచి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసింది. నిష్పాక్షిక, స్వతంత్ర విచారణ అవసరమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ర్యాలీలో భద్రతా ఏర్పాట్లు, జనసందోహ నియంత్రణ, విజయ్ రాక సమయం, పార్టీ నిర్వాహకులు-స్థానిక అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.

అయితే ఇటీవల కరూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల 32 మంది వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో విజయ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.