తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తిరుగులేని విజయాన్ని అందుకున్న డీఎంకే నేత స్టాలిన్.. సీఎంగా పగ్గాలు చేపట్టారు.. అప్పటి నుంచి పాలన విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.. కోవిడ్పై డీఎంకే సర్కార్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. మరోవైపు.. కోవిడ్పై పోరాటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. దీని కోసం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు సీఎం స్టాలిన్… అందులో 12 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే కావడం గమనార్హం.
సీఎం స్టాలిన్ చైర్పర్సన్గా వ్యవహరించనున్న ఈ కమిటీలో డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (అన్నాడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్ పార్టీ), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ), నాగై మాలి (సీపీఎం) సభ్యులుగా కొనసాగనున్నారు.. అయితే, కోవిడ్పై పోరాటంలో సలహా మండలిలో స్టాలిన్ అన్ని పక్షాలను ప్రాతినిథ్యం కల్పించడం.. ప్రతిపక్షాలకు పెద్ద పీట వేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఇది కొత్త రాజకీయ ఒరవడి అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషనలు చేస్తున్నారు.