CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు

  • సీజేపీ మరో ఉద్యమం
  • సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసన యాత్ర
  • హామీలు నెరవేర్చాలని డిమాండ్
  • బ్రిక్స్ సమావేశాల ముందు టెన్షన్
Cjp

Cjp

కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో మరోసారి నిరసనలకు రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ఆందోళనను విరమించింది. అయితే హామీలు నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ నిరసనకు సిద్దమవుతోంది.

సీజేపీ ప్రకారం.. సెప్టెంబర్ 5న నిర్వహించే మార్చ్ ఇండియా గేట్ నుంచి ప్రారంభమై ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగనుంది. ఈ మార్చ్‌కు నీట్ పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసుల చర్యల్లో బాధితులైన వారి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.

విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు.. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీజేపీ గతంలో డిమాండ్ చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని కూడా కోరింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేందుకు అంగీకరించిందని చెబుతూ సీజేపీ ఆందోళనను విరమించింది. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తామని అప్పట్లోనే హెచ్చరించింది. తాజాగా సీజేపీ విడుదల చేసిన ప్రకటనలో.. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని విమర్శించింది.

దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను సేకరించి వాటిని రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటివరకు ఆ జాబితాను అందించలేదని సీజేపీ ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ఆరోపిస్తూ.. విద్యార్థులు, యువజన సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో సెప్టెంబర్ 5న ఇండియా గేట్ దగ్గరకు చేరుకోవాలని సీజేపీ పిలుపునిచ్చింది.

గత ఆందోళనల్లో ఉద్రిక్తత

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ వాలంటీర్లు, విద్యార్థులు గత నెలలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పార్లమెంట్ వైపు మార్చ్ చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ఘర్షణల్లో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించడంతో.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాజకీయంగా, పోలీసు పరంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే నిరసనలు మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇప్పుడు ప్రపంచ నేతలు ఢిల్లీకి వస్తున్న తరుణంలో చేపడతున్న ఉద్యమం ఎటువంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందో చూడాలి.