భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ‘‘కాక్రోచ్లు’’, “పరాన్నజీవులు” అంటూ యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా సీజేఐ వివరణ ఇచ్చారు. తాను దేశ యువతను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించలేదని.. నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి ప్రవేశించిన వారినే ఉద్దేశించి వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. కానీ “నా మాటలను మీడియా వక్రీకరించింది” అంటూ వివరణ ఇచ్చారు.
మే 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా చేసిన మౌఖిక వ్యాఖ్యలను కొంతమంది మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని పేర్కొన్నారు. “నిన్న జరిగిన ఒక నిరర్థక కేసు విచారణలో నేను చేసిన వ్యాఖ్యలను కొంత మీడియా వక్రీకరించిన తీరు చూసి బాధపడ్డాను.’’ అని తెలిపారు.
‘‘నకిలీ, బోగస్ డిగ్రీల ఆధారంగా న్యాయవృత్తిలోకి వచ్చిన వారినే నేను విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లో కూడా చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను.’’ అని సూర్యకాంత్ వివరించారు. భారత యువతపై తాను వ్యాఖ్యానించానని వస్తున్న ఆరోపణలను ఖండించారు. “మన దేశ యువతపై నాకు ఎంతో గర్వం ఉంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువతే ప్రధాన స్తంభాలు” అని అన్నారు.
వివాదం ఎలా మొదలైందంటే?
సుప్రీంకోర్టులో అడ్వకేట్ సంజయ్ దూబే దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నియామకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ దూబే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం పిటిషనర్ వైఖరిని ప్రశ్నించింది. ‘‘సీనియర్ అడ్వకేట్ ట్యాగ్ అనేది కేవలం ప్రతిష్ఠ కోసమా? లేక న్యాయవ్యవస్థలో భాగస్వామ్యం కోసమా?” అని బెంచ్ ప్రశ్నించింది. అదే సమయంలో న్యాయవ్యవస్థపై కొంతమంది దాడులు చేస్తున్నారని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సమాజంలో కొంతమంది పరాన్నజీవులు వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఉద్యోగం దొరకదు.. వృత్తిలో స్థానం ఉండదు.. కొందరు మీడియాగా మారతారు.. కొందరు సోషల్ మీడియా కార్యకర్తలవుతారు.. ఇంకొందరు ఆర్టీఐ యాక్టివిస్టులవుతారు.. తర్వాత అందరిపై దాడులు మొదలుపెడతారు.’’ అని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే “ఉద్యోగాలు దొరకని కొంతమంది యువకులు కాక్రోచ్లు మాదిరిగా మారుతున్నారు.” అని సీజేఐ అన్నట్టుగా బయటకు రావడంతో పెను దుమారానికి దారి తీసింది.
ప్రతిపక్షాలు, న్యాయవాదుల సంఘాల ఆగ్రహం
సీజేఐ వ్యాఖ్యలపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఇది కేవలం పదజాలం సమస్య కాదు.. ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న భావజాలమే ఆందోళనకరం. నిరుద్యోగ యువత, ఆర్టీఐ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను ‘కాక్రోచ్లు’, ‘పరాన్నజీవులు’గా పోల్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది” అని విమర్శించారు.
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా సీజేఐ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. “దేశ న్యాయవ్యవస్థ అధినేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని పేర్కొంది.
నకిలీ లా డిగ్రీలపై సీజేఐ ఆందోళన
ఇక విచారణ సందర్భంగా సీజేఐ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. “వేలాది మంది నకిలీ డిగ్రీలతో నల్ల కోట్లు ధరించి తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలి” అని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదని.. కొంతమంది కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. చివరికి పిటిషనర్ సంజయ్ దూబే కోర్టుకు క్షమాపణలు చెప్పి తన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా.. ధర్మాసనం ఆమోదించింది.
