Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..

  • రిజర్వేషన్ విధానంపై ఎన్‌డీఏలోని ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు.
  • జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని చిరాగ్ పాస్వాన్ డిమాండ్.
Chirag Paswan

Chirag Paswan

Reservation row: రిజర్వేషన్ వివాదం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) డిమాండ్ చేసిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరారు. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే అంశంపై బహిరంగంగా విభేదించుకున్నారు. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని మాంఝీకి చెందిన HAM (సెక్యులర్) డిమాండ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర మంత్రులు మధ్య మాటల యుద్ధం సాగింది.

బీహార్ రాష్ట్రానికే చెందిన ఈ ఇద్దరు మంత్రులు ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఉప-కోటాలను (sub-quotas) ఏర్పాటు చేయాలని మాంఝీకి చెందిన HAM డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు అత్యంత వెనకబడిన, చారిత్రకంగా అణచివేయబడిన వారికి చేరేలా విధానాన్ని సమీక్షించాల్సిన అసవరం ఉందని మాంఝీ కుమారుడు, బిహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ అన్నారు. తాము రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పడం లేదని, మరింత న్యాయబద్ధంగా, సమర్థవంతంగా మార్చాలని, నిజంగా ప్రయోజనాలకు దూరంగా ఉన్న వారికి చేరాలని సుమన్ అన్నారు.

ఎందుకు వివాదం..?

చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP (రామ్ విలాస్), జితన్ రామ్ మాంఝీకి చెందిన HAM (సెక్యులర్) రెండూ బిహార్‌లోనూ, కేంద్రంలోనూ ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. మాంఝీ ముషహర్ వర్గానికి చెందినవారు. ఇది అత్యంత వెనకబడిన దళిత వర్గాల్లో ఒకటి. దళిత రిజర్వేషన్ల ప్రయోజనాలు ముఖ్యంగా పాస్వాన్, రవిదాస్ వర్గాలకే చెందుతున్నాయని ముషహర్లు భావిస్తున్నారు. దీంతో దళిత రిజర్వేషన్లలోనే సబ్ కోటా కావాలని డిమాండ్ చేస్తు్న్నారు. దీనికి 2024లో సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. ఆ తీర్పులో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనే మరింత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలా రాష్ట్రాలు ఉప-వర్గీకరణ అనుమతించింది.

మాంఝీ రాజీనామా చేయాలని చిరాగ్ డిమాండ్..

మాంఝీ పార్టీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్.. ఎస్సీ రిజర్వేషన్‌లో ఉప-కోటాలు, క్రీమీ లేయర్ ఉండాలని పార్టీ కోరుకుంటే ముందుగా మాంఝీ, సంతోష్ సుమన్ ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. సబ్ కోటాలు, క్రీమిలేషయర్ విధానాన్ని తమ పార్టీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోందని పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీల్లోని అన్ని వర్గాలు ఐక్యంగానే ఉన్నాయని చెప్పారు. ఆర్థిక ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషణ్ నిర్ణయించే విధానం రాజ్యాంగంలో లేదని చెప్పారు.

బదులిచ్చిన మాంఝీ ..

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తిప్పికొట్టారు. చిరాగ్ పాశ్వాన్ వైఖరి వల్ల పేద, నిరుపేద ప్రజలు రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రిజర్వేషన్ వ్యవస్థలో ఈ విభజన అవసరమని మంఝీ అన్నారు. చిరాగ్ పాశ్వాన్ పేదల గురించి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఒకవేళ చిరాగ్ పాశ్వాన్‌కు పేదల పట్ల శ్రద్ధ లేకపోతే, ఆయన ముందుగా తన పదవికి రాజీనామా చేయాలని మంఝీ అన్నారు.