Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా

  • రెండు రాష్ట్రాల మధ్య కావేరీ వివాదం
  • సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
  • ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు డీకే.శివకుమార పిలుపు
Cmvijay

Cmvijay

కావేరీ జల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కావేరీ జలాల విడుదలపై తాజా ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో జరగాల్సిన సమావేశాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అనుకూలంగా లేవని పేర్కొన్నారు. ముందుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

కావేరీ జల నియంత్రణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) సమర్థించిన ఒక రోజు తర్వాత డీకే శివకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను సీడబ్ల్యూఎంఏ ఆదేశించింది.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. కావేరీ వివాదానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పరిష్కారమైన తర్వాత మరింత స్నేహపూర్వక వాతావరణంలో తమిళనాడు ముఖ్యమంత్రితో సమావేశమవుతామని తెలిపారు. ‘‘తమిళనాడు ముఖ్యమంత్రితో సానుకూల వాతావరణంలో సమావేశం కావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన అంశాలు ముగిసిన తర్వాత భేటీ అవుదాం. దేశ చట్టాలను మనం గౌరవించాలి. ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం నిర్వహిస్తాం’’ అని అన్నారు.

కావేరీ జలాల విడుదలకు సంబంధించిన తాజా ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం సవాలు చేస్తుందని డీకే శివకుమార్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘కర్ణాటక ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ముందుగా ప్రతిపక్ష పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకోవాలి. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. అనంతరం వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. సీడబ్ల్యూఎంఏ రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే కర్ణాటకలో తాగునీటి అవసరాలను పరిరక్షించడమే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

‘‘వచ్చే ఏడాదిలో తాగునీటి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. రాష్ట్రానికి మొత్తం సుమారు 40 టీఎంసీల నీరు అవసరం. ఇందులో దాదాపు 36 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మరో 4 టీఎంసీలు ఆవిరి కావడం, ఇతర అవసరాల కోసం కావాలి’’ అని వివరించారు. కావేరీ జలాల వివాదంలో కర్ణాటక వాదనను బలంగా వినిపించేందుకు రాష్ట్ర న్యాయ బృందం, అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారని డీకే శివకుమార్ తెలిపారు.

వివిధ అంశాలపై చర్చించేందుకు సమావేశం కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించిందని డీకే శివకుమార్ తెలిపారు. ఆ విజ్ఞప్తిని అంగీకరించిన తర్వాత ఆగస్టు 3న సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించినట్లు చెప్పారు. అయితే కావేరీ జలాల వివాదంపై తాజా ఆదేశాలు వెలువడటంతో పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. ‘‘తాజా ఆదేశాల తర్వాత ప్రస్తుత వాతావరణం సమావేశానికి అనుకూలంగా లేదని భావిస్తున్నాను. కొంతకాలం పర్యటనను వాయిదా వేయాలని తమిళనాడు ముఖ్యమంత్రిని కోరాను. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణంలో సమావేశమవుదాం’’ అని డీకే శివకుమార్ తెలిపారు.

కావేరీ జలాల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఎలాంటి న్యాయ ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. మేకెదాటు జలాశయ ప్రాజెక్టు వల్ల కర్ణాటకతో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం ఉంటుందని మరోసారి తెలిపారు.

కావేరీ జలాల విడుదలపై సీడబ్ల్యూఎంఏ నిర్ణయం తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలాంటి బంద్‌కు పిలుపునివ్వొద్దని డీకే శివకుమార్ వివిధ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. ‘‘కర్ణాటక శాంతిని ప్రేమించే రాష్ట్రం. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుకోవాలి’’ అని అన్నారు.

మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అధికారులు భద్రతను పెంచారు. విజయ్ నటించిన ‘జన నాయకన్’ సినిమాకు సంబంధించిన శుక్రవారం ప్రదర్శనలను సంపిగే థియేటర్ యాజమాన్యం రద్దు చేసింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా థియేటర్ సిబ్బంది విజయ్ పోస్టర్లను తొలగించినట్లు లేదా కప్పివేసినట్లు సమాచారం. శ్రీరాంపుర పోలీసు అధికారులు కూడా ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. తమిళ భాష మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

కావేరీ జలాల వివాదంపై చర్చించి రాష్ట్రం తరఫున తీసుకోవాల్సిన తదుపరి చర్యలను నిర్ణయించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జలాల పంపిణీ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగస్టు 3న కర్ణాటకకు వెళ్లనున్నారంటూ వస్తున్న వార్తలపై డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ స్పందించారు. స్టాలిన్ కర్ణాటక పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని పేర్కొన్నారు. ‘‘ఆగస్టు 3న ఆయన కర్ణాటకకు వెళ్తారని ఎవరు చెప్పారు? ఆ ప్రకటన ఆయన సొంత పార్టీ నుంచే వచ్చింది. ఆయన కర్ణాటకకు వెళ్తారా లేదా అన్నదే ప్రశ్న. ఆయనకు కూడా తన పర్యటనపై స్పష్టత లేదేమో’’ అని ఇళంగోవన్ వ్యాఖ్యానించారు.