India-Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. చాలా ఏళ్లుగా బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సొంతదేశానికి పయణమవుతున్నారు. దీంతో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులకు జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ సరిహద్దుల్ని రక్షించే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB) సిబ్బందికి నచ్చడం లేదు. దీంతో సరిహద్దుల్లో మన భూభాగంలోనే కంచె నిర్మిస్తున్న భారత సరిహద్దు భద్రతా దళం (BSF)తో ఘర్షణకు దిగుతున్నారు.
బీఎస్ఎఫ్ వర్సెస్ బీజీబీ:
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూ సరిహద్దులలో ఒకటి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. 4096 కి.మీ సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ వైపు బీజీబీ ఉంటే, మన వైపు బీఎస్ఎఫ్ ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దు దళం మొత్తం బలం 70,000లుగా అంచనా, మన బీఎస్ఎఫ్ బలం 2,70,000.
బీజీబీ దురాక్రమణ ఎందుకు.?
ఇటీవల నెలల్లో భారత్ సరిహద్దుల్లో కంచె నిర్మిస్తుంటే, బీజీబీ తరుచుగా అడ్డుకుంటోంది. భారత్ అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని వాదిస్తోంది. 150 గజాల నో మ్యాన్స్ ల్యాండ్లో అక్రమంగా కంచె నిర్మిస్తున్నట్లు వాదిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గత కొంత కాలంగా రెండు దళాల మధ్య వందలాది సమావేశాలు జరిగాయి.
ఇటీవల కాలంలో బీజీబీ దూకుడు మరింతగా పెరిగింది. బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని, స్థానిక బంగ్లా ప్రజల సహకారంతో బీఎస్ఎఫ్పై దాడికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ స్మగ్లర్ల రాకపోకలు, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ సరఫరా వంటి వాటికి బీజీబీ సహకరిస్తోంది. ఇప్పుడు కంచె నిర్మిస్తే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇలాంటి ఘర్షణను కోరుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే సరిహద్దుల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.
