NTV Telugu Site icon

ఉద్యోగులకు యడియూరప్ప తీపి కబురు.. చివరి కానుక..!

DA

క‌ర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు బీఎస్‌ యడియూరప్ప… రేపేమాపో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. మరోవైపు.. యడియూరప్ప రాజీనామా చేసిన సమయంలో.. కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు ఆప‌ద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా గవర్నర్‌ కోరారు… ఇక, చివ‌రినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు తీపికబురు చెప్పారు యడియూరప్ప.. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో ఉద్యోగుల మూల‌వేత‌నంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూల‌వేత‌నంలో 11.25 శాతంగా ఉంది.. ఇప్పుడు ఏకంగా 21.50కు చేరింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 ల‌క్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 ల‌క్షల మంది పెన్షన‌ర్ల‌తో పాటు వివిధ‌ పీఎస్‌యూలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే దాదాపు మూడు ల‌క్షల మంది ఉద్యోగుల‌కు లబ్ధి చేకూర‌నుంది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది అధిష్టానం.. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.