Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆయనను, సహ నిందితుడు, మాజీ WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను నిర్దోషులుగా విడుదల చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈ కేసు విచారణ కొనసాగింది. జూలై 2, 2026న ఇరుపక్షాల తుది వాదనలు పూర్తయ్యాయి. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, ఆగస్టు 3న వెలువరిస్తామని ప్రకటించింది. కేసు విచారణలో పలువురు సాక్షులను కోర్టు విచారించింది. ప్రాసిక్యూషన్ తరఫున ఫిర్యాదుదారులు సహా మొత్తం 32 మంది సాక్షులను విచారించినట్లు కోర్టు ప్రక్రియకు సంబంధించిన నివేదికలు వెల్లడించాయి.
2024లో అభియోగాలు నమోదు
2024 మేలో కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్పై క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన అభియోగాలను నమోదు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆరుగురు ఫిర్యాదుదారుల్లో ఒక మహిళా రెజ్లర్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆయనను డిశ్చార్జ్ చేసింది. సహ నిందితుడు వినోద్ తోమర్పై కూడా అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 2023 జూన్ 15న ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో బ్రిజ్ భూషణ్పై భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354, 354A, 354D, 506 కింద ఆరోపణలు నమోదయ్యాయి. వీటిలో మహిళపై దాడి లేదా బలప్రయోగం, లైంగిక వేధింపులు, వెంటపడటం, క్రిమినల్ బెదిరింపులు వంటి నేరాలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్ ఇద్దరూ విచారణ సమయంలో బెయిల్పై ఉన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు
ఈ కేసు 2023లో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ప్రముఖ మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. అనంతరం ఈ వ్యవహారం న్యాయస్థానాల దృష్టికి వెళ్లి, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్లను నిర్దోషులుగా విడుదల చేయడంతో ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

